బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 28 వరకూ మూడు రోజుల పాటు సూర్యలంక బీచ్‌లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. అయితే బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బీచ్ ఫెస్టివల్ వాయిదా వేస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు సూర్యలంక బీచ్‌కు పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో.. బీచ్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు చేపట్టనున్నారు. బీచ్ అభివృద్ధి కోసం ఏపీ పర్యాటక శాఖ అధికారులు డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి నివేదించారు. ఈ డీపీఆర్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర పర్యాటక శాఖ.. మార్చి నెలలో సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రూ.97.52 కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరు కావటంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, కాంట్రాక్టర్ సంస్థకు పనులను కూడా అప్పగించారు. అయితే సెప్టెంబర్ 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవం కావటంతో.. ఆ రోజున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సూర్యలంక బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన, భూమిపూజ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్లలోగా అభివృద్ధి, ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని ఏపీ పర్యాటక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.మరోవైపు బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులలో భాగంగా సూర్యలంక బీచ్‌ వద్ద ప్రవేశ ద్వారాలు నిర్మించనున్నారు. రోడ్డు మధ్యన డివైడర్ మీద మొక్కలు నాటి బల్లలు ఏర్పాటు చేయనున్నారు. మార్నింగ్, ఈవినింగ్ సమయాల్లో సాగర తీరం అందాలు వీక్షించేందుకు ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సెంట్రల్‌ లైటింగ్, సైకిల్‌ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. బీచ్ ఒడ్డున 20 కాటేజీల నిర్మాణం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారు. అలాగే పిల్లల కోసం పార్కు అభివృద్ధి చేయనున్నారు. ఇక వాహనాలకు పార్కింగ్‌ జోన్లు, ఫుడ్ స్టాళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. స్పీడ్‌ బోటింగ్, స్కూబా డైవింగ్ వంటి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. ఇక బీచ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు వాహనాల కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ధ్యాన కేంద్రాలు, స్థానిక వ్యాపారుల కోసం స్ట్రీట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా ఈ బీచ్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసి సూర్యలంక బీచ్ రూపురేఖలు మార్చివేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.