ఎన్నారైలంతా తిరిగొస్తే.. భారత్‌కి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి..? అమెరికాకు వాటిల్లే నష్టమేంటి?

Wait 5 sec.

భారత్‌పై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఒకదాని తర్వాత ఒక బాంబు పేలుస్తున్నారు. ఇటీవల 50 శాతం సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్, తాజాగా హెచ్‌1బీ వీసా బాంబు పేల్చారు. ఇక నుంచి ఏదైనా అమెరికన్ కంపెనీ విదేశీయుడికి ఉద్యోగం ఇవ్వాలంటే.. హెచ్1బీ వీసా కోసం ప్రభుత్వానికి లక్ష డాలర్ల ఫీజు కట్టాలి. ఇప్పటికే హెచ్‌1బీ లబ్ధిదారుల్లో భారతీయులే 71 శాతం ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు హెచ్‌1బీ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. అయితే హెచ్‍1బీ వీసా ఫీజు పెంపు ఒకరకంగా భారత్‌కు మంచి అవకాశంగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఆర్థిక, సాంకేతిక వృద్ధికి దోహదపడిన భారతీయ టాలెంట్ స్వదేశానికి వచ్చి.. దేశ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తారని చెబుతున్నారు. మరి ఎన్నారైలు ఇండియాకు తిరిగి వస్తారా? టాప్ టాలెంట్ భారత్‌కు తిరిగి వస్తే ఏమవుతుంది? దీనివల్ల అమెరికాకు జరిగే నష్టం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విదేశాలకు టాప్ టాలెంట్..!దశాబ్దాలుగా భారత్‌లోని ప్రతిభావంతులు అవకాశాల కోసం విదేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాల్లో.. నాణ్యమైన విద్య, ప్రపంచ స్థాయి అవకాశాలు, సిలికాన్ వ్యాలీ లాంటి ఇన్నోవేషన్ డ్రివెన్ వ్యవస్థలో పని చేయాలని చాలా మంది అమెరికా బాట పట్టారు. ఇలాంటి వారికి హె1బీ వీసా సువర్ణావకాశంగా మారింది. కొందరు ఉద్యోగాల్లో చేరగా.. మరికొందరు ముందుడుగేసి స్టార్టప్‌లు పెట్టి వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న హెచ్1బీ ఫీజు నిర్ణయం వల్ల.. ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ నిర్ణయం ద్వారా అమెరికాకు ఐటీ సేవలు ఎక్కువగా అందిస్తోన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ మొత్తంగా చూస్తే ఈ పరిణామం భారత్‌కు మంచి అవకాశం అవుతుందని నిపుణులు అంటున్నారు. టాప్ టాలెంట్ తిరిగి వస్తే ఏమవుతుంది?భారత్‌కు మంచి అవకాశం..!తమ టాప్‌ టాలెంట్ విదేశాలకు తరలివెళ్తోందని ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ తాజాగా నిర్ణయం వల్ల వీరిని ఉపయోగించుకోవడానికి భారత్‌కు మంచి అవకాశం వచ్చింది. అలాంటి మానవ వనరులను సమర్థంగా వినియోగించుకుంటే.. ఆవిష్కరణల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. టాప్ క్లాస్ ఇంజినీర్లు, సైంటిస్టులు, టెక్ నిపుణులు భారత్‌లో ఉంటే.. కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. వీరంతా భారత్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు, అత్యాధునిక టెక్నాలజీని క్రియేట్ చేసేందుకు, ప్రపంచ స్థాయిలో పోటీ పడే కంపెనీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భారత్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రపంచంలో మూడో అతిపెద్దది. దీంతో అనుభవం కలిగిన హెచ్1బీ ఫీజు బాధితులు తిరిగి వస్తే.. ఏఐ, రోబోటిక్స్, బయోటెక్ వంటి రంగాల్లో భారత్ ప్రపంచ స్థాయిలో పోటీ పడొచ్చు.డాలర్ డ్రీమ్ టు ఇండియన్ డ్రీమ్..!ఇలా వచ్చిన ఎన్ఆర్ఐలు ఇక్కడ కూడా విజయవంతంగా తమ కెరీర్లు నిర్మించుకుంటే.. చాలా మందిలో అమెరికా డ్రీమ్, డాలర్ డ్రీమ్‌పై ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి. అమెరికా వంటి దేశాల్లో పీహెచ్‌డీలు, టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నారు తిరిగి వస్తే.. భారత్ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య అందించొచ్చు. రీసెర్చ్ కార్యకలాపాలు కూడా ఊపందుకుంటాయి. అయితే ఈ టాలెంట్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడానికి భారత్ అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అనేది చాలా కీలకం. డీప్ క్యాపిటల్, మార్కెట్‌కు అనుగుణంగా నియంత్రణ పద్ధతులు, రిస్క్ తీసుకునే సంస్కృతి ఉన్న సిలికాన్ వ్యాలీ వంటి వ్యవస్థలు లేకుండా టాప్ టాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేము. ఇలా కూడా జరగొచ్చు..?హెచ్1బీ బాధితులు ఒక్కసారిగా ఇండియాకు వస్తే.. ఇక్కడ జాబ్ మార్కెట్‌లో గందరగోళం ఏర్పడుతుంది. పోటీ పెరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్లకు ఉద్యోగం ఇస్తే.. ఇప్పటికే ఉన్న వాళ్ల ఉద్యోగాలు ప్రభావితం కావచ్చు. వారి జీతాలు, ప్రమోషన్లు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో చాలా మంది నిరుద్యోగులుగా, సామర్థ్యానికి తగ్గ పని లేకుండా ఉంటారు. అమెరికాలో పని చేసి వచ్చినవారు లీడర్‌షిప్ రోల్స్, ఉన్నత స్థాయి రోల్స్‌ను డిమాండ్ చేస్తారు. దీంతో ప్రస్తుతం ఉన్న మేనేజర్లు, ఉన్నత స్థాయి ఉద్యోగులు చిక్కుల్లో పడతారు. ఇక్కడికి వచ్చిన వారి వల్ల నగరాల్లో గృహనిర్మాణం, ట్రాఫిక్, ఆరోగ్య సంరక్షణ సామర్థ్యంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇక తిరిగి వచ్చేవారికి అధిక జీవనశైలి అంచనాలు ఉంటాయి. కాబట్టి వారు అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. హెచ్1బీ వీసా ఫీజు బాధితులు కూడా వస్తే.. జాబ్ మార్కెట్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుంది. తిరిగి వచ్చిన వారికి భారత్ ఉద్యోగాలు సృష్టించగలదా?ఈ విషయంలో చైనా నుంచి భారత్ నేర్చుకోవాలి. గతంలో కూడా చైనా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ప్రస్తుతం చైనాలోని చాలా కంపెనీలు.. ఇలా అమెరికా నుంచి తిరిగొచ్చిన వారు నడిపిస్తున్నవే. విదేశంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగ అనుభవం ఉన్నవారు ప్రపంచస్థాయి సంస్థలను నడిపిస్తున్నారు. అయితే అమెరికా వద్దనుకున్న వ్యక్తులకు అవకాశాలు ఇవ్వడం కాదు.. విదేశాల్లో ఉన్న టాప్ టాలెంట్‌ను భారత్ ఆకర్షించాలి. ఇలాంటి టాలెంట్ భారత్ విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. అనుమతుల్లో ఆలస్యం, పేలవమైన నియంత్రణ, మూలధనం లేకపోవడం, అవినీతి, సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త ఆవిష్కరణలు చేయడం కష్టతరం అవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా విధానాలు రూపొందించాలి. పెట్టుబడి సాయం అందించాలి. పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదంతా బాగానే ఉన్నా.. హెచ్1బీ వీసాదారులు భారత్‌కు తిరిగి వస్తారా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. ఎన్నారైలు భారత్‌కు తిరిగి వస్తారా?లక్ష డాలర్ల ఫీజు ప్రభుత్వానికి కట్టి.. హెచ్1బీ వీసాదారులను తీసుకునేందుకు కంపెనీలు వెనకాడొచ్చు. దీంతో చాలా మంది ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా భారత్‌కు తిరిగి వస్తారా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న వారిలో చాలా మంది భారత్‌కు తిరిగి రాకపోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఉన్న యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పని చేయడానికి వీరు ఇష్టపడతారని అంటున్నారు. లేదంటే యూఏఈ, సింగపూర్, మలేసియా, చైనా లాంటి దేశాల వైపు చూసే అవకాశం ఉంది. స్వదేశంలో స్థిరపడాలని అనుకున్న వారు మాత్రమే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చినా విదేశీ కంపెనీలకు రిమోట్‌గా వర్క్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్యాకేజీ ఆఫర్ చేస్తేనే.. పెద్ద మొత్తంలో ఎన్నారైలు ఇక్కడికి తిరిగొచ్చే అవకాశం ఉందనేది నిపుణుల అభిప్రాయం. దీనివల్ల అమెరికాకు నష్టం ఏంటి?విదేశీ టాలెంట్ వల్ల అమెరికా చాలా లాభపడుతోంది. బిలియన్ డాలర్ల కొద్దీ ట్యాక్సులోపాటు.. ట్రిలియన్ డాలర్ల విలువైన సేవలను వీరు అమెరికాకు అందిస్తున్నారు. సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేసే వారిలో పావు భాగం విదేశీయులే. సిలికాన్ వ్యాలీలో ఉన్న అనేక స్టార్టప్‌లకు భారతీయులతో పాటు విదేశీయులే ఫౌండర్లు, కో-ఫౌండర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారు సొంత దేశాలకు వెళ్లిపోతే.. నిపుణుల కొరత ఏర్పడుతుంది. కంపెనీలకు ముఖ్యంగా స్టెమ్ ఫీల్డ్‌లో నిపుణుల లభ్యత కష్టమవుతుంది. ఇక హెచ్1బీ వీసాదారులపై అధికంగా ఆధారపడ్డ కంపెనీల కార్యక్రమాల్లో అడ్డంకులు వస్తాయి. దీంతో ఏఐ వంటి రంగాల్లో ఉన్న కంపెనీలు మార్కెట్‌లో పోటీ పడలేవు. అంతేకాకుండా కొత్త ఆవిష్కరణల సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల దీర్ఘ కాలంలో ఆర్థిక, టెక్నాలజీ రంగాలు రిస్క్‌లో పడతాయి. కాబట్టి అమెరికన్ టెక్ కంపెనీలు కూడా ప్రత్యామ్నాయాల దిశగా ఆలోచించే అవకాశం ఉంది. అనుభవం ఉన్న నిపుణులు భారత్‌కు తిరిగి రావడం మంచి పరిణామమే అయినా.. వారు తిరిగి వస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ వస్తే మాత్రం.. వారి నైపుణ్యాలను ఉపయోగించుకునేందుకు ప్రపంచ స్థాయి వ్యవస్థలను ఏర్పాటు చేసి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. మన దేశం నుంచి మేధో వలసలు ఉండకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం, కొత్త పరిశ్రమలు, స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణం కల్పించడంపై దృష్టి సారించాలి. రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారికి అండగా ఉండాలి. ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో ఎంట్రీ లెవెల్ జా‌బ్‌లకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంపొందించాలి. ఇలా జరిగితేనే ఆవిష్కరణలు పెరగడంతోపాటు.. ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది.