బంగారం ధరలు తగ్గించేందుకు రంగంలోకి కేంద్రం.. ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే?

Wait 5 sec.

Gold Price: ఈ 2025 ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు ఆకాశమేహద్దుగా పెరుగుతున్నాయి. అమెరికా సుంకాలు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య యుద్ధాలు, వాణిజ్య అనిశ్చితులు అంటూ ఎన్నో అంశాలు బంగారం, వెండి ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇక కిలో వెండి రేటు రెండు లక్షల రూపాయల పైన ట్రేడవుతోంది. దీంతో కొనుగులుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రిటైల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే వాదనలూ వినిపిస్తున్నాయి. బంగారం, వెండి రిటైల్ అమ్మకపు ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే ఊహాగానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టత ఇచ్చింది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రిటైల్ మార్కెట్‌లో బంగారం చేసుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానమిచ్చింది. 'బంగారం, వెండి ధరల నియంత్రణకు సంబంధించి రిటైల్ మార్కెట్‌లో ఈ విలువైన లోహాల ధరలను ప్రభుత్వం నియంత్రించే ప్రణాళిక ఏదీ లేదు. సాధారణంగా బంగారం ధరలు ప్రపంచవ్యాప్త డిమాండ్, సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, ద్రవ్యోల్బణం, డాలర్ మారకం రేటు, ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయి. కేంద్రం విధానాలు పరోక్షంగా వీటిపై ప్రభావం చూపినా రిటైల్ అమ్మకపు ధరలను నేరుగా నియంత్రించే లేదా నిర్ణయించే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగానే ఇప్పటికే హాల్‌మార్కింగ్‌ను (Hallmarking) తప్పనిసరి చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు గుర్తు చేసింది. హాల్‌మార్కింగ్ ద్వారా వినియోగదారులకు నాణ్యత, స్వచ్ఛతకు హామీ లభిస్తుందని పేర్కొంది. నగల వ్యాపారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం, వినియోగదారులకు మోసాలు జరగకుండా చూడటంపై దృష్టి సారించినట్లు తెలిపింది.అయితే, ధరలను నిర్ణయించడం కాకుండా బంగారం, వెండి వ్యాపారంలో సరైన వాణిజ్య పద్ధతులను పాటించడం, మోసాలను అరికట్టడం, పన్నుల విధానాలను పర్యవేక్షించడం వంటి అంశాలపై మాత్రమే కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక శాఖ తెలిపింది. బంగారం, వెండి రిటైల్ ధరలను కేంద్రమే నిర్ణయిస్తుందనే ప్రచారం కేవలం ఊహాగానం మాత్రమేనని తెలిపింది. ధరల నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ప్రస్తుతం కేంద్రం వద్ద లేదని బలంగా పేర్కొంది.