దాయాది పాకిస్థాన్‌తో అగ్రరాజ్యం అమెరికా అంటకాగుతోన్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదటిసారి అధ్యక్షపీఠం ఎక్కినప్పుడు పాక్‌పై నిప్పులు చిమ్మిన .. 2.0లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.. ఈ క్రమంలో పాక్‌కు అమెరికా బంపరాఫర్ ఇచ్చింది. తమ లోకోమోటివ్ రైళ్లను దాయాదికి విక్రయించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు, పాకిస్థాన్‌లో అరుదైన ఖనిజాల వెలికితీతకు కూడా సహకారం అందజేయడానికి అమెరికా ముందుకొచ్చినట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ పాక్ పత్రిక ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ ఓ కథనం వెలువరించింది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మహమ్మద్‌ ఔరంగజేబు ఈ ఏడాది అక్టోబరులో అమెరికా పర్యటన సందర్భంగా వీటిపై చర్చలు మొదలైనట్టు పేర్కొంది. అధ్యక్షుడి అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల సలహాదారు రేమాండ్‌ ఎమోరి కాక్స్‌, దక్షిణ, మధ్య ఆసియా సీనియర్ డైరెక్టర్ రికీ గిల్‌ స్వయంగా పాక్‌ మంత్రితో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా తయారు చేసిన లోకోమోటివ్‌లను కొనుగోలు చేయాలని పాక్‌ను గిల్‌ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పాక్‌ అమెరికా తయారుచేసిన 55 లోకోమోటివ్‌లను వాడుతోంది. నగదు కొరతను ఎదుర్కొంటోన్న పాక్.. ప్రస్తుతం వాటి మరమ్మత్తు, పునరుద్ధరణపై దృష్టి సారించింది.అలాగే, ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ లైసెన్స్ అనుమతులను కూడా సానుకూలంగా పరిశీలించాలని రికీ గిల్‌ కోరినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే అమెరికా సంస్థలపై పాకిస్థాన్‌ 5 శాతం డిజిటల్ పన్నును రద్దుచేసింది. ఇక, ఖనిజ రంగంలో పెట్టుబడులకు 135 బిలియన్‌ డాలర్లను అమెరికా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బలూచిస్థాన్‌లోని రెకో డిక్‌ మైనింగ్‌ సంస్థకు 1.25 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ద్వారా మంజూరు చేయించింది. అంతేకాదు, పాకిస్థాన్‌‌లో ఖనిజ నిల్వల అన్వేషణ, కృత్రిమ మేధ అభివృద్ధిలో ఇరు దేశాలూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. కాగా, పట్ల ఇప్పటికే పాక్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, అసీమ్ మునీర్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్ ఆసిమ్‌ మునీర్‌.. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా పర్యటనతో దాయాది-అగ్రరాజ్యం మధ్య సంబంధాల్లో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అసిమ్ మునీర్‌‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి, డిన్నర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే అమెరికా అధునాత ఎయిమ్ 120 క్షిపణులను పాక్‌కు అందజేయడానికి సిద్ధమైనట్టు నివేదికలు రాగా.. అవి నిజం కావని అమెరికా కొట్టిపారేసింది.