ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా నిలిచింది. ఈ ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లో ధరలు లేకపోవడంతో పాటు, వాతావరణం కూడా సహకరించకపోవడంతో పంట నాణ్యత దెబ్బతింది. దీంతో రైతులు తమ పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఉల్లి ధరలు పడిపోవడం, ప్రతికూల వాతావరణంతో పంట నాణ్యత తగ్గడంతో నష్టపోయిన రైతులకు రూ.128.33 కోట్లు విడుదల చేసింది. ఈ-క్రాప్ ఐడీ ఆధారంగా అర్హులైన వెంటనే పరిహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఈ సాయం అందిస్తున్నారు.ప్రకటించిన సహాయం ప్రకారం, నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.20 వేల చొప్పున పరిహారం అందజేస్తారు. ఈ పథకం కింద, కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752 మంది రైతులను గుర్తించి, వారికి పరిహారం అందించారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ డబ్బుల్ని ప్రభుత్వం రైతుల అకౌంట్‌లలో జమ చేస్తోంది. ఈ-క్రాప్ ఐడీని పరిశీలించి, అర్హులైన రైతులందరికీ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. రాష్ట్రంలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం కొత్త ఛైర్మన్లను నియమించింది. ఈ నియామకాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుల్లో ఒకటైన గుంటూరు మార్కెట్ కమిటీకి టీడీపీ నాయకుడు కుర్రా అప్పారావు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే, కడప జిల్లాలోని సిద్దవటం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన తమ్మిశెట్టి శ్రీలేఖను ప్రభుత్వం ఎంపిక చేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన పలుగుళ్ల విజయలక్ష్మిని నియమించారు. ఈ నియామకాలతో మూడు పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.