తెలంగాణ రాష్ట్రంలో .. అత్యాధునిక సాంకేతికతను జోడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరులందరికీ 'స్మార్ట్ కార్డులు' పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్న సర్కారు.. తొలి దశలో 'మహాలక్ష్మి' పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల కోసం ప్రత్యేకంగా కామన్ మొబిలిటీ కార్డులను (CMC) జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్.. భవిష్యత్తులో కేవలం రవాణాకే పరిమితం కాకుండా డిజిటల్ గవర్నెన్స్‌కు కీలక వేదికగా మారనుంది. ఈ కార్డుల రూపకల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)తో ఒప్పందం కుదుర్చుకుంది.గతేడాది ప్రారంభమైన మహిళా సాధికారతలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా.. ప్రభుత్వం రూ. 8,500 కోట్ల విలువైన టికెట్లను భరించింది. అయితే, ప్రస్తుత విధానంలో ఆధార్ కార్డు చూపించి 'జీరో టికెట్' తీసుకోవడం వల్ల కండక్టర్లు, ప్రయాణికుల మధ్య పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్‌లో ఫోటోలు స్పష్టంగా లేకపోవడం, నకిలీ కార్డుల వినియోగం, పొరుగు రాష్ట్రాల మహిళలతో గుర్తింపు సమస్యలు వంటి కారణాలతో నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.సీఎంసీ (CMC) అనేది కేవలం ఒక బస్సు పాస్ మాత్రమే కాదు. ఇది ఒక మల్టీ-పర్పస్ డిజిటల్ వాలెట్. ఈ కార్డు కలిగి ఉన్న మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ట్యాప్ చేయడం ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, ఇందులో నగదును లోడ్ చేసుకుని మెట్రో రైలు, ఎంఎంటీఎస్ (MMTS) వంటి ఇతర రవాణా సేవలకు కూడా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో రేషన్ కార్డు, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ఈ కార్డుకే అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ భారీ లక్ష్యం. దీనివల్ల ప్రయాణికులకు ఆధార్ కార్డును ప్రతిసారీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.ఈ స్మార్ట్ కార్డుల ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనం 'డేటా ఆధారిత పాలన'. ప్రస్తుతం ఏ రూట్లలో మహిళల రద్దీ ఎక్కువగా ఉందో ప్రభుత్వానికి ఖచ్చితమైన గణాంకాలు లేవు. సీఎంసీ అమల్లోకి వస్తే, ప్రతి ప్రయాణం డిజిటల్‌గా రికార్డ్ అవుతుంది. ఫలితంగా మహిళలు ఏ సమయాల్లో, ఏ రూట్లలో ఎక్కువగా ప్రయాణిస్తున్నారో తెలుస్తుంది. ఈ సమాచారం ఆధారంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బస్సులను ఏర్పాటు చేసి, తక్కువ రద్దీ ఉన్న చోట సర్దుబాటు చేయడం ద్వారా ఆర్టీసీకి నష్టాలు తగ్గించవచ్చు. అక్రమ టికెట్ల జారీకి అడ్డుకట్ట పడటంతో పాటు, రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.ముందుగా మహిళలతో ప్రారంభించి, క్రమంగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తేవడం ద్వారా తెలంగాణ డిజిటల్ విప్లవానికి నాంది పలకనుంది. ఒకే కార్డుతో బస్సు, మెట్రో, షాపింగ్, ప్రభుత్వ సేవలను పొందే అవకాశం రావడం తెలంగాణ రవాణా, సామాజిక రంగంలో ఒక 'గేమ్ ఛేంజర్'గా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.