ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్టుకు కొత్త పేరు పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కొత్తగా డిమాండ్లు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు సరైన గుర్తింపు ఇవ్వాలంటే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తోందని.. ఈ నేపథ్యంలోనే తాను మాత్రమే నిర్ణయం తీసుకోవడానికి లేదన్నారు. అందరి అభిప్రాయాలతో పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ సూచించిన విధంగానే పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఎమ్మెల్సీ నాగబాబు కోరారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు అందరూ తమ వాణి వినిపించాలని సూచించారు. పెనుగొండ సుబ్బారాయుడు నేతృత్వంలో పలువురు ఆర్యవైశ్య నేతలు.. ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన నాగబాబు.. వైసీపీ పాలనలో ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు మాత్రమే పెట్టారని.. మరో పేరు పెట్టలేదని విమర్శించారు. అలాంటి సంస్కృతికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం సేవ చేసిన వారి పేర్లను ప్రభుత్వ పథకాలకు నామకరణం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టుకు అమరజీవి జలధార పేరు పెట్టినట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలుమరోవైపు పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి కొత్త అంచనాలు రూపొందించారు. ప్రాజెక్టు కోసం మొత్తం రూ.62,436 కోట్లు వ్యయం అవుతుందని తాజా అంచనాలు వేశారు. కేంద్ర ప్రభుత్వం తొలిదశలో మంజూరు చేసిన నిధులతో పాటుగా.. రెండోదశ అంచనాలు కలిపి పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.62,436 కోట్లుగా అంచనా వేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల దిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా.. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు రెండో దశ నిధుల కోసం లేఖ సమర్పించారు. మరోవైపు గడిచిన11 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ.23,658.40 కోట్లు కేటాయించింది.