‘మాస్ మహారాజ్’ ట్యాగ్‌ని పక్కన పెట్టేసిన రవితేజ.. రీజన్ ఏంటంటే?

Wait 5 sec.

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇందులో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఎల్వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం శనివారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ ట్యాగ్‌ గురించి దర్శకుడు కిషోర్ తిరుమల ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ లో హీరోలందరికీ ఏదొక 'స్టార్' ట్యాగ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అభిమానులు తమ హీరోలను ఒరిజినల్ నేమ్స్ తో కంటే ఈ పేర్లతోనే ఎక్కువగా పిలుచుకుంటూ ఉంటారు. సినిమాల్లో టైటిల్ కార్డులో పేరుకి ముందు ఆ ట్యాగ్ నే వాడుతుంటారు. అలాగా రవితేజకి కూడా ‘మాస్ మహారాజ్’ అనే టైటిల్ ఉంది. గత కొన్నేళ్లుగా ప్రతీ సినిమాలో ఆయనకి ఈ ట్యాగ్ వేస్తున్నారు. ఆ పేరు మీదుగానే ఇటీవల ఏకంగా 'మాస్ జాతర' అనే సినిమా కూడా చేశారు. అయితే ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ కోసం ఆ ట్యాగ్ ని పక్కన పెట్టేసినట్లు కిషోర్ తిరుమల చెప్పారు. ()ప్రెస్‌ మీట్‌ లో కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ''భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా సంక్రాంతికి మీ ముందుకు రాబోతోంది. కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో 100 శాతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుంది. రవితేజతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కథను రాసుకున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను'' అని అన్నారు. ''రవితేజతో ఎప్పటినుంచో పరిచయం ఉంది. ఆయన నటించిన ‘పవర్‌’ సినిమాకి నేను వర్క్ చేశా. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ కథ కూడా ముందు ఆయనకే చెప్పా. డేట్స్‌ కుదరకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాం'' అని తెలిపారు.''రవితేజ, నా టేస్టులు సిమిలర్ గా ఉంటాయి. ఆయనకి కూడా నాలాగే భాగ్యరాజా, క్రేజీ మోహన్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు అంటే ఇష్టం. మేమెప్పుడు మాట్లాడుకున్నా అలాంటి సినిమాల రెఫరెన్సుల గురించి మాట్లాడుకునేవాళ్లం. కథ, అందులోని క్యారక్టర్ ను బట్టే నేను సినిమాలు చేస్తుంటాను. అందుకే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా వరకూ ‘మాస్ మహారాజ్’ ట్యాగ్ వద్దని రవితేజ చెప్పాడు. కేవలం 'రవితేజ' అని మాత్రమే టైటిల్స్ లో వేద్దాం అని అన్నాడు'' అని కిషోర్ తిరుమల చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఎక్కువగా మాస్ సినిమాలే చేస్తున్న రవితేజ.. ఈసారి ట్రాక్ మార్చి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి క్లాస్ మూవీతో రాబోతున్నారు. ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించే వ్యక్తిగా కనిపించనున్నారు. సంక్రాంతి పండగ సీజన్ కి తగ్గట్టుగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. అందుకే రవితేజ ఈ సినిమా వరకూ తన మాస్ ఇమేజ్ తో పాటుగా ‘మాస్ మహారాజ్’ ట్యాగ్ ని కూడా పక్కన పెడుతున్నారని అర్థమవుతోంది. ()