ట్రైన్ ప్రయాణం ఇక ఫ్లైట్ వేగంతో.. హైదరాబాద్-విజయవాడ 3 గంటల్లో చేరుకోవచ్చు..!

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయాన్ని విమాన ప్రయాణంతో సమానంగా తగ్గించేలా రైల్వే శాఖ భారీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రైలులో వెళ్లాలంటే ఎదురుచూపులు, ఓపిక చాలా అవసరం. కానీ త్వరలోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం ఒక తీపి అనుభూతిగా మారనుంది. దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని 'గోల్డెన్ డయాగనల్' కారిడార్‌లో రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచేందుకు మెగా ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం మూడు గంటల లోపే ఉండనుంది. ప్రస్తుతం మాత్రమే అందుబాటులో ఉన్న ఈ 'సెమీ హైస్పీడ్' రికార్డును దక్షిణ భారతదేశంలోనే మొదటిసారి మన తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ రైళ్లు ఈ దూరాన్ని చేరుకోవడానికి 4 నుండి 5 గంటల సమయం తీసుకుంటున్నాయి. అయితే.. ట్రాక్ ఆధునీకరణ పూర్తయితే కనీసం ఒక గంట నుంచి గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా హై-డెన్సిటీ రూట్లను ఎంపిక చేశారు. అందులో సికింద్రాబాద్ - కాజీపేట, కాజీపేట - విజయవాడ, విజయవాడ - దువ్వాడ, విజయవాడ - గూడూరు మార్గాల్లో ఇప్పటికే వందే భారత్, దురంతో వంటి ప్రీమియం ట్రైన్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం వీటి గరిష్ట వేగం గంటకు 130 కి.మీ ఉండగా.. దానిని 160 కి.మీకి పెంచేందుకు అనుమతి కోరుతూ రైల్వే బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపారు.సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే.. ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ఒక గంట, విమాన ప్రయాణం ఒక గంట, మళ్లీ గన్నవరం నుంచి విజయవాడ సిటీకి వెళ్లడానికి మరో 40 నిమిషాలు.. ఇలా మొత్తం 3 గంటల సమయం పడుతుంది. అదే రైళ్ల వేగం పెరిగితే.. నగర నడిబొడ్డున ఉండే స్టేషన్ల నుంచే 3 గంటల్లో విజయవాడకు చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు ఖర్చు తగ్గడమే కాకుండా.. సమయం కూడా ఆదా అవుతుంది. గతంలో ట్రాక్ వేగాన్ని 110 కి.మీ నుండి 130 కి.మీకి పెంచడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని ఇప్పుడు 160 కి.మీకి అప్‌గ్రేడ్ చేయడానికి కూడా అనుమతులు వచ్చిన తర్వాత మరో రెండేళ్లు పడుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 6,560 కిలోమీటర్ల నెట్‌వర్క్‌లో ఇప్పటికే 28 శాతం (1,834 కి.మీ) మార్గం 130 కి.మీ వేగానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కొత్తగా 2,500 కిలోమీటర్ల మేర ట్రాక్స్‌ను హైస్పీడ్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమే.