పెళ్లి అనేది నూరేళ్ల పంట అని నమ్మే యువకుల ఆశలను ఆసరాగా చేసుకుని ఒక యువతి నిలువునా ముంచేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసిన ఈ ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపుతోంది. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని, పెళ్లి పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ముంచేస్తున్న ఒక యువతి బండారం ఎట్టకేలకు బయటపడింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన 19 ఏళ్ల వాణి అనే యువతి.. మధ్యవర్తుల సహకారంతో వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ వార్తల్లో నిలిచింది. ఇటీవల కర్ణాటకకు చెందిన సురేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకుని.. వారం తిరగకుండానే పారిపోవడంతో ఈమె మోసాలు వెలుగులోకి వచ్చాయి.వాణి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి.. తండ్రికి దూరమై బంధువుల వద్ద పెరిగింది. ఈమె దీనస్థితిని ఆసరాగా చేసుకున్న ఇచ్ఛాపురానికి చెందిన ముగ్గురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, ఒడిశా, కేరళకు చెందిన పెళ్లికాని యువకులను ఎంపిక చేసుకుంటారు. వాణితో పెళ్లి చేస్తామని నమ్మించి బాధితుల వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే వాణి అక్కడి నుంచి తెలివిగా జారుకుంటుంది. ఆ తర్వాత వసూలు చేసిన సొమ్మును వాణి, మధ్యవర్తులు పంచుకుంటారు.తాజాగా మోసపోయిన కర్ణాటక వరుడు సురేష్.. ఇచ్ఛాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణిని పిలిపించి విచారించగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. వాణి ఇప్పటివరకు దాదాపు 8 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కానీ తాను కేవలం ఒక పెళ్లి మాత్రమే చేసుకున్నానని.. మరో రెండు నిశ్చితార్థాలు జరిగాయని తెలిపింది. కేవలం డబ్బు కోసమే ఇలా చేశానని పోలీసుల వద్ద అంగీకరించింది. అయితే 8 పెళ్లిళ్లు చేసుకోలేదని ఆమె వాదిస్తోంది.బాధిత యువకులు తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇప్పించాలని.. తమను మోసం చేసిన వాణిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. ఈ మోసం వెనుక ఉన్న ఆ ముగ్గురు మహిళల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ, బాధితులకు న్యాయం చేసే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.