సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చేవారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఈ అవార్డులను విస్మరించారు. అయితే ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ 'గద్దర్ అవార్డ్స్' పేరిట పురస్కారాలను అందజేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో నంది అవార్డులు ఎప్పుడు ఇస్తారనే చర్చలు జరిగాయి. తాజాగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులతో పాటు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తెలిపారు. ఈ వేడుకలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు. అలానే త్వరలో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తుందని చెప్పారు.దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో ‘ఆవకాయ్‌’ పేరుతో జనవరి 8 నుంచి 10 వరకు ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్య విభాగాల్లో ఈ వేడుకలు ఉండనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో షూటింగ్‌ జరుపుకొనే చిత్రాలకు ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఉంటుందన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని.. నాటకాలను సినిమానూ సమానంగా చూడాలని సీఎం పలుమార్లు చెప్పారన్నారు.చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి హోం శాఖ నేతృత్వంలో త్వరలో ఓ సమావేశం నిర్వహించనుందని మంత్రి దుర్గేష్ చెప్పారు. అయితే ఈ సమావేశంలో సినీ పరిశ్రమ వర్గాలేవీ పాల్గొనడం లేదని, వారితో మరోసారి సమావేశం నిర్వహించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వారికి వివరిస్తామని తెలిపారు. బడ్జెట్‌ను బట్టి సినిమాకు సహకారం అందించాలనే ఒక ఆలోచన ఉందని, అలాగే రాష్ట్రంలో షూటింగ్‌ జరుపుకున్న సినిమాలకు సపోర్ట్‌ చేస్తామమన్నారు. థియేటర్ల నుంచి ఆదాయం తగ్గుతోంది కాబట్టే, భారీ బడ్జెట్‌ సినిమాలకు సహకారం అందిస్తున్నామని దుర్గేష్ చెప్పారు. నటీనటుల రెమ్యూనరేషన్స్ కాకుండా బడ్జెట్‌ ఎక్కువగా ఉంటే సినిమాకు సహకారం ఇవ్వాలనే ఒక వాదన ఉందని.. అలానే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ కలిపితే సినిమా బడ్జెట్‌ పెరుగుతోందనే మరో వాదన కూడా ఉందని కందుల దుర్గేష్ అన్నారు. రెండింటికీ మధ్యే మార్గంగా ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నామని, దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏపీలో ఎక్కువగా సినిమా షూటింగులు జరపడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని మంత్రి చెప్పుకొచ్చారు.