Mobile Recharge : ప్రస్తుత రోజుల్లో మొబైల్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక్క క్షణం ఫోన్ లేకుంటే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది, ఏమీ తోచదు. అలాంటి ఫోన్ వాలిడ్ రీఛార్జ్ లేకుండా మూగబోతే మనసున పట్టదు. అప్పు చేసైనా సరే ఫోన్ రీఛార్జ్ చేస్తారు. లేదంటే ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. దీంతో రీఛార్జ్ గడువు దగ్గరపడుతున్న సమయంలో ఏదో ఆందోళనగా ఉంటుంది. చాలా మంది నెల రోజులు, మూడు నెలల ప్లాన్స్ ఎంచుకుంటారు. దీంతో ప్రతిసారీ గడువు ముగిసే సమయంలోపు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకింత చికాకు తెప్పిస్తుందని చెప్పవచ్చు. అంతే కాదు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలియకుండానే అదనపు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను, అదనపు భారాన్ని తప్పించుకోవాలంటే లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఏడాది వ్యాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేస్తే చాలు ఎలాంటి ఇబ్బందులు, అంతరాయం లేకుండా సంవత్సరం మొత్తం కాల్స్, డేటా వాడుకోవచ్చు.ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఏడాదిలో ఎలాంటి రాజీ పడాల్సిన పని లేదంటూ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడీ కలిగి ఉంటుంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఒత్తిడి లేకుండా ఏడాది మొత్తం మొబైల్ ఫోన్ వినియోగించుకోవచ్చు. కేవలం రూ.2799తోనే ఈ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు ఏకంగా 3జీబీ డేటా అందిస్తోంది. అలాగే అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ మేరకు 'ఈ కొత్త ఏడాదిలో రాజీ పడాల్సినవసరం లేదు. ద్వారా రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 365 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇవన్నీ భారతీయులు నమ్మే స్వదేశీ నెట్‌వర్క్ ద్వారా లభిస్తున్నాయి. నిజమైన డేటా కింగ్‌ ద్వారా ఈ 2026ను ప్రారంభించండి' అంటూ రాసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు అందిస్తోన్న ఏడాది రీఛార్జ్ ప్లాన్స్‌తో పోలిస్తే ఈ ప్లాన్ ధర చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు 4జీ సేవలు అందుతాయని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఈ ప్లాన్‌ను బీఆర్ఈఎక్స్ ద్వారా ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవాలని చెబుతోంది. ఇతర నెట్ ‌వర్క్స్ అందిస్తోన్న ఏడాది ప్లాన్లతో ఈ కొత్త ప్లాన్‌ను పోల్చుతూ ఓ గ్రాఫిక్ ఇమేజ్ పోస్ట్ చేసింది. అయితే వివిధ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 2025, డిసెంబర్లో 5జీ సేవలు ప్రారంభిస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించిందని, ఇప్పుడు తమ పట్టణంలో 4జీ సేవలు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.