గోల్డ్ కరెక్షన్ స్టార్ట్ అయిందా.. ఒక్కసారిగా భారీగా దిగొచ్చిన బంగారం ధర.. ఏ జువెల్లరీలో గ్రాము ధరెంతంటే?

Wait 5 sec.

22k : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకలు ఇలా ఏదైనా బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మహిళలు ఎక్కువగా ఈ సమయాల్లో బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించాలని చూస్తుంటారు. . అంతర్జాతీయంగా అనిశ్చితి, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు, కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వల్ని పెంచుకోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాల్ని విధిస్తుండటం ఇలా చాలా కారణాలతో బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇటువైపు పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. దీంతో ధర కూడా విపరీతంగా పెరిగింది. ఈ ఏడాదిలో ఏకంగా 75 శాతానికిపైగా పెరిగింది. వెండి ధర ఇంకా దారుణంగా 170 శాతానికిపైగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం కూడా ధరలు విపరీతంగా పెరిగేందుకు కారణమైందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 29న ఒక్కసారిగా బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ మొదలైనట్లు చెబుతున్నారు. రేట్లు భారీగా దిగొచ్చాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఉదయం 4500 డాలర్లపైన ట్రేడవగా.. ఇప్పుడు అది (మధ్యాహ్నం 3 గంటలకు) 4,460 డాలర్ల దిగువన ఉంది. ఇంట్రాడేలో ఒక దశలో ఇది 4,450 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అంతకుముందు ఇంట్రాడేలో 4,549 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఇక్కడ ఒక దశలో రూ. 2300 కుపైగా పతనంతో రూ. 1,37,646 వద్దకు చేరింది. ఇప్పుడు రూ. 1,38,300 స్థాయిలో ఉంది. దీంతో దేశీయంగా కూడా రేట్లు దిగొచ్చాయి. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియనుందని.. శాంతి ఒప్పందం కుదరబోతుందని.. దాదాపు 90 శాతం పూర్తయిందని ట్రంప్ ప్రకటించడంతో అనిశ్చితి కాస్త తగ్గింది. ఇదే బంగారం ధరల్ని తగ్గించడంలో తోడ్పడిందని తెలుస్తోంది. దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు ఇప్పుడు రూ. 185 తగ్గింది. ఇదే తులానికి రూ. 1850 పడిపోయి రూ. 1,28,700 కు చేరింది. ఇప్పుడు లలితా జువెల్లరీలో గ్రాము బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 12,870 గా ఉంది. ఇదే తనిష్క్‌లో చూస్తే గ్రాము పసిడి ధర రూ. 12,985 వద్ద ఉంది. జోయాలుక్కాస్, ఖజానా, కళ్యాణ్ జువెల్లర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి వాటిల్లోనూ బంగారం ధర గ్రాము రూ. 12,870 గా ఉంది. ఈ ధరలు ఇలా ఉన్నప్పటికీ.. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వర్తిస్తుంది. ఇది షాపుల్ని బట్టి వేర్వేరుగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక బంగారం ధరలకు మించి వెండి ధర పడిపోయింది. ఇవాళ ఆరంభంలో భారీగానే పడిపోయినా మళ్లీ పెరిగి ఇంట్రాడేలో ఒక దశలో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 84 డాలర్లపైన ట్రేడయింది. తర్వాత ఒక్కసారిగా 10 శాతం వరకు పతనమైంది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో 74 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఇది దాదాపు రూ. 6 వేలకుపైగా తగ్గినట్లు చూయిస్తోంది.