పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీపికబురు వినిపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పది పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థి, విద్యార్థినులతో గళ్లా మాధవి తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు.అనంతరం మాట్లాడిన గళ్లా మాధవి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోవని ఈ విద్యార్థులు నిరూపించారని అన్నారు. గతంలో తాను ప్రకటించిన విధంగానే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను త్వరలోనే విహారయాత్రకు తీసుకెళ్లనున్నట్లు గళ్లా మాధవి ప్రకటించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పది పరీక్షల్లో 600 మార్కులకు 585, 586 వరకు మార్కులు సాధించిన విద్యార్థులు ఉండటం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఇంతటి ప్రతిభ కనబరచడం రాష్ట్ర విద్యా రంగంలో వచ్చిన సానుకూల మార్పుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి మంత్రి నారా లోకేష్ చేపట్టిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ ప్రధాన కారణమని గళ్లా మాధవి పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, అంకితభావం పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గళ్లా మాధవి వివరించారు. బెంచీలు, పుస్తకాలు, బ్యాగులు మార్చడం మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తును మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని.. అదే నిజమైన విద్యా సంస్కరణ గళ్లా మాధవి అభివర్ణించారు. పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ, వారు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.మరోవైపు గుంటూరు కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో, స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ సహకారంతో వివిధ నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు గళ్లా మాధవి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన గళ్లా మాధవి.. గ్రామీణ ప్రాంతాల నుంచి అమ్మాయిలను చదువుల కోసం బయటకు పంపడం ఒకప్పుడు తల్లిదండ్రులకు పెద్ద సవాల్‌గా ఉండేదని గుర్తు చేశారు. భద్రత, అవకాశాల కొరత, సామాజిక పరిస్థితుల కారణంగా కుటుంబాలు ఎన్నో ఆందోళనలు ఎదుర్కొనేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, టెక్నాలజీ అభివృద్ధి, విద్యా అవకాశాల పెరుగుదలతో గ్రామీణ యువతకు అపార అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.