TG: కీలక నిర్ణయం దిశగా రవాణా శాఖ.. ఇక షోరూంలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు, రవాణా శాఖ కార్యకలాపాలలో పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న తీవ్ర కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ముందుగానే ప్రణాళికలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.రవాణా శాఖలో మార్పులు.. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు. రవాణా శాఖ కార్యాలయాలలో మధ్యవర్తుల పాత్రను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వల్ల ప్రజలకు అధికారులతో నేరుగా పని చేసుకునే అవకాశం లభించి, అవినీతికి అవకాశం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రవాణా శాఖలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని మరింత పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల సేవలు వేగంగా.. పారదర్శకంగా అందుతాయని ఆయన వివరించారు. ఆధునిక సాంకేతికత ద్వారా రవాణా నియంత్రణను మరింత సమర్థవంతంగా చేయవచ్చు.విద్యుత్ వాహనాల ప్రోత్సాహం.. కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి పెట్టింది. విద్యుత్ వాహనాలపై రూ. 577 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం గ్రీన్ మొబిలిటీని పెంచుతోంది. ఈ ప్రోత్సాహం కారణంగా విద్యుత్ వాహనాల విక్రయాలు 0.03 శాతం నుంచి 1.30 శాతానికి పెరిగాయి. వాహన సారథి పోర్టల్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభతరం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య ఒక కోటి డెబ్బై లక్షలకు చేరిందని మంత్రి వెల్లడించారు. షోరూమ్‌లలోనే వాహనాల రిజిస్ట్రేషన్ (Registration) చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలు నియమ నిబంధనలను పాటిస్తూ సహకరిస్తేనే.. ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యం వంటి సమస్యలు తగ్గుతాయని ఆయన విజ్ఞప్తి చేశారు.