రూ.లక్షకు నెలకు వడ్డీ రూ.15 వేలు.. టెంప్టింగ్‌గా ఉంది కాదా.. కానీ..

Wait 5 sec.

అధిక వడ్డీల ఆశ చూపించి.. గిరిజన ప్రాంతాల నుంచి కోట్ల రూపాయల డబ్బును వసూలు చేసి, తప్పించుకు తిరుగుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను నల్గొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ మోసాలకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శరత్‌ చంద్ర పవార్ మీడియాకు వివరించారు. నల్గొండ జిల్లా, పీఏ పల్లి మండలం, వద్దిపట్ల పలుగు తండాకు చెందిన రమావత్ మధు నాయక్ ఈ మోసం వెనుక కీలక సూత్రధారిగా ఉన్నాడు. మధు నాయక్ మొదట్లో ఇదే తండాకు చెందిన బాలాజీ నాయక్ వద్ద ఏజెంట్‌గా పని చేశాడు. బాలాజీ నాయక్ కూడా అధిక వడ్డీ ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్లు వసూలు చేసి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. బాలాజీని ఆదర్శంగా తీసుకున్న మధు నాయక్, తాను కూడా అదే పద్ధతిలో డబ్బు సంపాదించాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం తన బావలు అయిన భరత్, బాబు, రమేశ్‌లతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు.ముఠా సభ్యులు హైదరాబాద్‌లో (Hyderabad) 'గోకుల నందన ఇన్‌ఫ్రా' అనే కంపెనీని స్థాపించారు. గిరిజనుల నమ్మకాన్ని పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించారు. జహీరాబాద్ దగ్గర భూములు, , స్పా కేంద్రాలు, కర్నూల్‌‌లో సిమెంట్ కర్మాగారం ఉన్నట్లుగా నమ్మించారు. ఈ మోసగాళ్లు ప్రతి నెలా లక్షకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వడ్డీ ఇస్తామని ఆశ చూపారు . ఇలా నిరక్షరాస్యులు, నిస్సహాయులు అయిన గిరిజనులను లక్ష్యంగా చేసుకొని... వారి కష్టార్జితాన్ని కోట్ల రూపాయల్లో వసూలు చేశారు. ఈ డబ్బుతో ముఠా సభ్యులు అతి విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. విలువైన కార్లు , బంధువులు, స్నేహితుల పేర్ల మీద భూములు, భవనాలు కొనుగోలు చేశారు.వసూలు చేసిన డబ్బులో కొంత భాగాన్ని పబ్బులు, , పందేలు , స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయారు. ఈ దుబారా వల్ల డబ్బులు తిరిగి చెల్లించడం కష్టమైంది. ముఠా నాయకుల్లో ఒకడైన బాలాజీ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో, బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని మధు నాయక్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో మధు నాయక్ కనిపించకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మధు నాయక్‌తో సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి విలువైన భూమి పత్రాలు, నాలుగు కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.