తెలంగాణలో వర్షాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కూడా పడొచ్చునని అన్నారు. దక్షిణ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దాని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. మంగళవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.