ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌‌కు బిగ్ షాక్.. టీడీపీ నుంచి సస్పెండ్.. 2024లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి

Wait 5 sec.

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం తయారీ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అంతేకాదు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్ , కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ సస్పెండ్‌ చేసింది. సీఎం ఆదేశాల మేరకు.. ఈ వ్యవహారంలో వారి పాత్రపై విచారణ చేయాలని నిర్ణయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఇందులో భాగంగా ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు తెలిపారు. 'రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. ఈ కేసులో దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు' అని చంద్రబాబు ఆదేశించారు.'ములకలచెరువులో జరిపిన ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో ముందుగా కొందరు వ్యక్తులు నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారు.. వారిని విచారించి సేకరించిన సమాచారం అధారంగా ములకలచెరువు గ్రామంలో సోదాలు నిర్వహించాము. ములకలచెరువు సమీపంలోని కదిరినత్తునికోట గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. నకిలీ మద్యం తయారు చేస్తున్న 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్టు చేశాము. అలాగే, ఫేక్ లేబుల్స్, వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నాము. ఎ1గా అద్దేపల్లి జనార్ధన్ రావు అనే వ్యక్తిని గుర్తించాము.. అతనికి విజయవాడలో ఒక బార్ లైసెన్సు ఉంది. నకిలీ మద్యం దందాకు ములకలచెరువుకు వచ్చాడు.. ఇక్కడ తయారైన మద్యాన్ని పెద్దతిప్పసముద్రంలోని ఆంధ్రా వైన్స్, ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్‌లో విక్రయించారు. ఈ నకిలీ మద్యం తయారీలో ఇతనే ప్రధాన నిందితుడు, తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులను, ఒడిశాకు చెందిన వారిని కూడా నియమించుకున్నాడు. నకిలీ మద్యం సరఫరాకు ఓ డ్రైవర్‌ను కూడా నియమించుకున్నాడు' అని అధికారులు సీఎంకు తెలియజేశారు. 'అద్దేపల్లి జనార్ధన్ రావు సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేస్తున్న అంశాన్ని మిగతా నిందితులు అంగీకరించారు.నకిలీ మద్యాన్ని విక్రయించిన రాక్ స్టార్ లైసెన్స్ టి రాజేష్ అనే వ్యక్తి పేరిట ఉంది.. రాజేష్‌కు సంబంధించిన వాహనంలోనే నకిలీ మద్యం రవాణా చేస్తుంటే మేము పట్టుకున్నాము. రెండు వైన్ షాపులపైన సోదాలు నిర్వహించి, సీజ్ చేశాము. ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు గుర్తించాము. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నాము.. స్థానిక నాయకుడు జయచంద్రారెడ్డి పాత్రపై కూడా సమగ్ర విచారణ చేస్తున్నాము. ఒక ప్రణాళికతో అద్దేపల్లి జనార్ధన్ రావు ఏర్పాటు చేసిన ఈ లిక్కర్ తయారీ కేంద్రానికి కొందరు స్థానికుల సహకారం కూడా ఉన్నట్టు గుర్తించాము. ఏ1 జనార్ధన్ రావు, ఏ2 కొట్టారాజు, ఏ5 పి రాజేష్, ఏ12 కె శ్రీనివాసరావులును అరెస్టు చేయాల్సి ఉంది. ఆర్ధిక లావాదేవీలతో పాటు నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడకు సరఫరా చేశారన్న అంశాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నాము' అని ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.