తెలంగాణ మరింత మెరుగైన సేవలు అందించేందుకు గాను.. ఇకపై బస్సుల లైవ్ లొకేషన్ వివరాలు గూగుల్‌ మ్యాప్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని మరింత సులభంగా, కచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. సాధారణంగా గూగుల్‌ మ్యాప్స్‌లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి పట్టే సమయం మాత్రమే తెలుస్తుంది. అయితే.. ఈ కొత్త ఒప్పందం ద్వారా.. ప్రయాణికులు జిల్లా, అంతర్రాష్ట్ర బస్సుల కదలికలను కూడా తమ మొబైల్‌లో చూడగలుగుతారు.తెలంగాణ ఆర్టీసీ బస్సుల రాకపోకల సమాచారాన్ని (లైవ్ డేటా) గూగుల్‌ మ్యాప్స్‌లో అందించడానికి గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ శాఖ ఈ విషయాన్ని వివరిస్తూ ఆర్టీసీ ఎండీకి లేఖ రాసింది. గూగుల్‌ ప్రతినిధి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి బస్సుల లైవ్‌ జీపీఎస్ డేటాను తమకు అందించాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించింది. ఐటీ శాఖ ద్వారా ఈ బస్సుల సమాచారాన్ని దీపావళి కల్లా గూగుల్‌కు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీలోని దాదాపు 9,500 బస్సుల లైవ్‌ డేటాను గూగుల్‌కు షేర్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు జీపీఎస్‌ సౌకర్యం ఉంది. ఈ డేటాను గూగుల్‌కు షేర్ చేయడం ద్వారా ప్రయాణికులు అనేక ప్రయోజనాలు పొందనున్నారు. బస్సుల కదలికలకు సంబంధించిన తాజా సమాచారం ప్రతి 30 సెకన్లకోసారి గూగుల్‌ మ్యాప్స్‌లో అప్‌డేట్ అవుతుంది. దీంతో బస్సు ఎక్కడ ఉందో, ఎంతసేపట్లో తమ స్టాప్‌కు చేరుకుంటుందో కచ్చితంగా తెలుసుకోవచ్చు.ఎలా పనిచేస్తుంది?గూగుల్‌ మ్యాప్స్‌లో ట్రాన్సిట్‌ (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్) అనే సింబల్‌ను ఎంచుకోవాలి.ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో (ఉదాహరణకు, విద్యానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు లేదా హైదరాబాద్‌ నుంచి జనగామకు) టైప్‌ చేయాలి.మ్యాప్స్‌లో ఈ వివరాలు కనిపిస్తాయిబస్టాప్‌కు ఉన్న దూరం.బస్సు ఆ స్టాప్‌కు ఎన్ని నిమిషాల్లో వస్తుంది.ఎక్కాల్సిన బస్సు నంబరు.మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుంది.ఒక బస్సు వెళ్లిపోతే, తరువాత బస్సు ఎప్పుడు వస్తుంది.గమ్యస్థానానికి ఎన్ని నిమిషాల్లో చేరుకుంటారు.ముందస్తు అమలుఈ సేవలు మొదటగా సిటీ బస్సులలో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత జిల్లా, అంతరాష్ట్ర బస్సుల సమాచారాన్ని కూడా చేర్చాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీకి 'గమ్యం' యాప్‌ ఉన్నప్పటికీ.. సరైన నిర్వహణ లోపాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఈ సమాచారం అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు కచ్చితమైన, నమ్మకమైన సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.