ఏపీలో ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట లభించింది.. ఆ ఫీజును మినహాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం దీనిపై కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో ఎంబీబీఎస్‌ సీటు పొందిన విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. తర్వాతి కౌన్సెలింగ్‌లలో అదే కాలేజీలో ఆలిండియా కోటాలో సీటు వస్తే, వారికి యూనివర్శటీ ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి రాధికారెడ్డి తెలిపారు. ప్రస్తుతం, వివిధ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు యూనివర్శిటీకి రూ.10,600 ఫీజు చెల్లించాలి. ఈ మినహాయింపు పొందడానికి, ఆయా మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు కేటాయింపు పత్రాలు అందజేయాల్సి ఉంటుంది.ఏపీ ప్రభుత్వం అప్డేట్స్ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖలో పాలనా వేగాన్ని పెంచడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్‌, కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ రూపొందించిన ప్రణాళికలను ఆమోదించారు. దీని ప్రకారం, ఇకపై 45 ముఖ్యమైన అంశాలలో కేవలం 17 అంశాలకు మాత్రమే మంత్రి ఆమోదం అవసరం. మిగిలిన విషయాలపై అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి 15 అంశాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడం, కొత్త నియామకాలు, సిబ్బంది వైద్య ఖర్చుల చెల్లింపు, సెలవులు మంజూరు వంటివి ఇందులో ఉన్నాయి. డిప్యూటీ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, అదనపు కార్యదర్శులు కలిసి 13 అంశాలను చూసుకుంటారు. సెక్షన్‌ ఆఫీసర్‌ స్థాయి సిబ్బంది ఇంక్రిమెంట్లు, ఇతర చెల్లింపులు, RTI దరఖాస్తులు, వివిధ విభాగాల మధ్య సమన్వయం వంటి పనులు వీరి పరిధిలోకి వస్తాయి. ఈ కొత్త విధానం వల్ల పనులు మరింత వేగంగా జరుగుతాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆదివారం అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2,103 మంది అభ్యర్థులకు గాను 1,494 మంది (71.04 శాతం) హాజరయ్యారు. సోమవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంటుంది. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8న సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని బోర్డు ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈ పరీక్ష విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, గుంటూరు కేంద్రాల్లో జరిగింది. పరీక్షకు హాజరైన వారి శాతం 71.04. అభ్యంతరాలుంటే ఈ నెల 8న సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని సూచించారు. రాజస్థాన్‌ ప్రణాళిక శాఖ అధికారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పరిశీలిస్తారు. అధికారులు మొదట సచివాలయంలో పథకాల గురించి తెలుసుకుంటారు.. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అమరావతి నిర్మాణం, జల్‌జీవన్‌ మిషన్, అమృత్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి చెబుతారు. పీ4, అన్నక్యాంటీన్లు, పాలనలో సాంకేతికత వినియోగం వంటి విషయాలపైనా వారికి అవగాహన కల్పిస్తారని 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌ లంకా దినకర్‌ తెలిపారు. రాజస్థాన్ అధికారులు కొన్ని ప్రాంతాలను సందర్శిస్తారని.. ఎన్టీఆర్‌ జిల్లాలోని విజన్‌ ప్లాన్‌ సెంటర్‌ను పరిశీలిస్తారన్నారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లను కూడా వారు సందర్శిస్తారన్నారు.