ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు, ఆ జిల్లాకు మహర్దశ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది.. రాష్ట్రానికి కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రాబోతోంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) రూ.1,200 కోట్లతో కొత్త క్షిపణులద యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్‌లను తయారు చేస్తుంది. ప్రకాశం జిల్లా వస్తుంది. దీనివల్ల 600 మందికి నేరుగా, 1,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయి. భారత సైన్యానికి అవసరమైన మిసైళ్లు, ఇతర ఆయుధాలను ఇక్కడ తయారు చేస్తారు. ఈ యూనిట్ కోసం బీడీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 1,400 ఎకరాలు కావాలని అడిగింది. సంస్థ అధికారులు ఇప్పటికే దొనకొండ దగ్గర భూములను చూశారు. బీడీఎల్, డీఆర్‌డీవో సహకారంతో మిసైళ్లు, ఇతర ఆయుధాలను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీపీఆర్‌ను బీడీఎల్ ప్రభుత్వానికి ఇచ్చింది.ఇప్పటికే భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కల్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్స్ లిమిటెడ్ కూడా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రూ.2,400 కోట్లతో ప్లాన్ చేశారు. ఈ యూనిట్‌లో అత్యాధునిక రక్షణ పరికరాలను తయారు చేస్తారు. ఈ రెండు యూనిట్ల వల్ల రక్షణ పరికరాల తయారీ, పరిశోధనలలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సెన్సర్లు, కమ్యూనికేషన్, క్షిపణులు, తుపాకుల వంటి ఆయుధ వ్యవస్థలను సమన్వయం చేస్తుంది. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తయారు చేస్తారు. అంతరిక్ష ప్రయోగాలు, సైన్యం కోసం వెయ్యి టన్నుల పేలోడ్ మోసే రాకెట్ మోటార్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. 2026 మార్చి నాటికి అనుమతులు వస్తాయి. 2028 మార్చికి నిర్మాణం పూర్తవుతుంది. 2028 సెప్టెంబరు నాటికి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్ల రెండు లేన్ల అప్రోచ్ రోడ్డు కావాలి. రోజుకు 25 వేల కిలోవాట్ల విద్యుత్, రోజుకు 2 వేల కిలోలీటర్ల నీటి సరఫరా వ్యవస్థలు కూడా అవసరమని BDL ప్రతిపాదించింది. ఈ సదుపాయాలు యూనిట్ సజావుగా నడవడానికి తోడ్పడతాయి. బీడీఎల్‌కు ఈ యూనిట్ కోసం మొత్తం 1,346.67 ఎకరాల భూమి అవసరం. మొదటి దశలో రూ.650 కోట్లు, రెండో దశలో రూ.550 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ యూనిట్‌లో వెయ్యి టన్నుల ప్రొపెల్లెంట్ మోటార్లు, 130 సమీకృత ఆయుధ వ్యవస్థలు తయారు చేస్తారు. ప్రభుత్వం 317 ఎకరాలను ఎకరాకు రూ.7.73 లక్షల చొప్పున కేటాయిస్తుంది. మిగిలిన భూమిని సేకరించాలని యోచిస్తోంది.