ఎట్టకేలకు ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొత్త రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి!

Wait 5 sec.

ఎట్టకేలకు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.. వచ్చే ఏడాది ఉగాది పండుగకు శ్రీకాకుళం జిల్లా బ్రిడ్జి అందబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలాసలో పర్యటించారు. కాశీబుగ్గలో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్లైఓవర్‌, కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు బజారు పనులను వారు పరిశీలించారు. రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షాపుల్ని తొలగించే బాధ్యతను అధికారులు తీసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను (రైల్వే బ్రిడ్జి, రైతు బజార్) ఉగాది నాటికి ప్రారంభిస్తామని ప్రకటించారు. పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ఆదేశించారు. రైతులకు షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. కాశీబుగ్గలోని ఎంపీయూపీ స్కూల్‌ ఆవరణలో రైతు బజారును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైతు బజారు నిర్మాణానికి అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయి. రైతులు తమ పంటలను ఇక్కడే నేరుగా అమ్ముకోవచ్చు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో రైతులకు షాపుల్ని ఏర్పాటు చేసి అందజేస్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఇటు ఉద్దండపాలెం, పాలతలగాం గ్రామాలలో రూ.2 కోట్ల NABARD-RIDF నిధులతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బోరుభద్రలో రూ.67 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు భవనాలను కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారుమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు . మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. రహదారి పనుల్లో జాప్యంపై గ్రామస్థులు ఫిర్యాదు చేయగా, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రహదారులపై గత ప్రభుత్వం కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేదన్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘ నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. దీనివల్ల గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించక అభివృద్ధి కుంటుపడిందన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రహదారి పనుల్లో జాప్యం వల్ల కాలువల్లో దోమలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి వెంటనే స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు, పనులు వేగవంతం చేయాలని కంట్రాక్టర్‌‌ను ఆదేశించారు. పనులను పర్యవేక్షించాలని RDO కృష్ణమూర్తిని కూడా ఆదేశించారు. మందస మండలం సవర టుబ్బూరులో వృద్ధ దంపతులు సవర బుద్ధయ్య, రూపమ్మలు గోడ కూలి చనిపోయారు. వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.8 లక్షల నష్టపరిహారం ఇచ్చింది. ఆదివారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ చెక్కును అందజేశారు. మృతుల కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.