చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు..

Wait 5 sec.

చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేత వస్త్రాలను 50 శాతం డిస్కౌంట్ మీద అందిస్తోంది. ఆప్కో ఆధ్వర్యంలో ఏపీ సచివాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక కౌంటర్లను ఏపీ చేనేత, జౌళి శాఖ ప్రారంభించారు. ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉప్పాడ, మదనపల్లె, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, మంగళగిరి పట్టుచీరలతో పాటుగా కాటన్ చీరలు, ఇతర వస్త్రాలు, రెడీమేడ్ చేనేత దుస్తులను 50 శాతం డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆప్కో ఈ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసింది. సచివాలయంలోని మహిళా ఉద్యోగుల విజ్ఞప్తి ఈ మేరకు ఈ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. మార్చి పదో తేదీ వరకూ ఈ స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. చేనేతలకు ఉచిత విద్యుత్..మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేతలకు ఉచిత విద్యుత్ అందించనున్న సంగతి తెలిసిందే. హ్యాండ్ లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. చేనేతల సంక్షేమం, చేనేత రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. చేనేతలకు సంవత్సరం పొడుగునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని.. ఇందుకోసం ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక చేనేత స్టాళ్లకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి మంచి స్పందన వచ్చిందన్న మంత్రి.. మహిళా ఉద్యోగుల కోసం సచివాలయం వద్ద చేనేత కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు. మరోవైపు చేనేతలకు ఉచిత విద్యుత్ నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని లక్షా 3 వేల 534 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 93 వేల చేనేత కుటుంబాలకు, 10,534 మరమగ్గాలు ఉన్న కుటుంబాలకు లబ్ధి చేకూర్చనుంది. అలాగే చేనేత కుటుంబానికి నెలకు 720 రూపాయల చొప్పున ఏడాదికి 8 వేల 640 రూపాయలు ఆదా అవుతుంది. మరమగ్గాలు ఉన్న యజమానులకు నెలకు రూ.1800 చొప్పున సంవత్సరానికి 21 వేల 600 వరకూ ఆర్థికంగా లబ్ధి కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.