'వచ్చే ఏడాది మనం ఈ స్థితిలో ఉండకూడదు'.. మంత్రి లోకే‌ష్‌కు నా అన్వేషణ అన్వేష్ రిక్వెస్ట్

Wait 5 sec.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో వైరల్‌గా మారే ప్రముఖ తెలుగు అన్వేష్.. మరో వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పేర్కొన్న అన్వేష్.. అక్షరాస్యతలో రాష్ట్రం బాగా వెనకబడిపోయిందని పేర్కొన్నాడు. చదువు చాలా ముఖ్యమని.. విద్య లేని వాడు వింత పశువు అనే సామెతను కూడా గుర్తు చేసిన అన్వేష్.. దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందు వరుసలో ఉంటాయని తెలిపాడు. కేరళ మాత్రం అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉంటుందని వెల్లడించాడు. అయితే గతేడాది దేశంలోని అక్షరాస్యత రేటు 2025 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని.. ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉందని పేర్కొన్నాడు. బిహార్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌ కిందే ఉందని తెలిపాడు. తాను మొదటి నుంచి విద్యను ప్రోత్సహిస్తానని.. చదువుకు సంబంధించి 200కు పైగా వీడియోలు చేసినట్లు వెల్లడించాడు. చదువు ఎంత ముఖ్యమో తాను చెబుతానని పేర్కొన్నాడు. ఐటీ, విద్యా శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్.. దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశాడు. తాను విశాఖలోని పూర్ణా మార్కెట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నట్లు చెప్పిన అన్వేష్.. పదో తరగతిలో తమను పాస్ చేయించేందుకు.. తమ ఉపాధ్యాయులు ప్రైవేటుగా ట్యూషన్ చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అలా తాను టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి.. అమెరికాలో ఉద్యోగం సాధించినట్లు చెప్పాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసి.. అమెరికాలో ఉద్యోగాలు ఎలా సాధించాలో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వివరించాడు. తాను ఏకంగా వెయ్యిమందికిపైగా అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించినట్లు చెప్పాడు.చదువుతో తన దారిద్ర్యాన్ని రూపుమాపినట్లు నా అన్వేషణ వెల్లడించాడు. పవర్ ఫుల్ పవన్ కళ్యాణ్, ఎంతో అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రిగా వచ్చే ఏడాది అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్‌ ఈ స్థానంలో ఉండకూడదని పేర్కొన్నాడు. కందుకూరి వీరేశలింగం పుట్టిన మన గడ్డకు ఇలాంటి పరిస్థితి రావద్దని తెలిపాడు. చదువు కోసం అమెరికా వెయ్యి బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. చైనా 800 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. 4 కోట్ల జనాభా ఉన్న చిన్న దేశమైన మలేసియా 22 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. కానీ 140 కోట్ల ప్రజలు ఉన్న భారతదేశం మాత్రం చదువు కోసం 16 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మలేసియా, థాయిలాండ్ లాంటి మన పొరుగున ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా భారత్ కంటే ఎక్కువగా చదువుపై ఖర్చు చేస్తున్నాయని నా అన్వేషణ అన్వేష్ పేర్కొన్నారు.