విశాఖపట్నంలో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ దిశగా అడుగులుపడుతున్నాయి. నగరంలోని ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్ పెట్టేందుకు.. శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో మూడు నెలల్లో ప్రారంభంకానుంది.. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి వెళ్లే వారికి ఆనందపురం జంక్షన్‌ కీలకం కానుంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.. విశాఖ నుంచి, అనకాపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఫ్రీగా.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేలా చర్యలు చేపట్టారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌లు ఆనందపురం జంక్షన్‌, పూల మార్కెట్‌లను పరిశీలించారు. అంతేకాదు ఆనందపురం జంక్షన్‌లో కొత్త ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మ్యాప్‌, మార్కెట్‌ యార్డును పరిశీలించారు. ఆనందపురం జంక్షన్ దగ్గర భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామన్నారు భీమిలిఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. ఆనందపురం జంక్షన్ దగ్గర చేపట్టిన ఈ పనులు వారం, పది రోజుల్లో ప్రారంభించి రెండు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రోడ్డును వెడల్పు చేస్తామని తెలిపారు. అంతేకాదు అక్కడ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. మరో ఏడాదిన్నర, రెండేళ్లలో ఫ్లై ఓవర్ నిర్మించేలా ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆనందపురం జంక్షన్ దగ్గర ఉన్న ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు కూరగాయలు, పూల మార్కెట్‌ను సమీపంలోని రైతు బజార్‌కు కేటాయించిన 95 సెంట్ల స్థలానికి తరలించే అంశంపై ఎమ్మెల్యే, కలెక్టర్ చర్చించారు. కోల్డ్‌ స్టోరేజ్‌, పూల మార్కెట్, కూరగాయల మార్కెట్‌కు విశాలమైన పార్కింగ్ నిర్మిస్తామన్నారు. పూల మార్కెట్‌, కూరగాయల మార్కెట్‌లను.. భీమిలి మార్కెటింగ్‌ కమిటీ నిర్మించిన యార్డులోకి కానీ, ఎస్సీ కార్పొరేషన్‌ స్థలంలోకి మార్చే ఆలోచనను పరిశీలిస్తున్నారు. ఆనందపురం జంక్షన్ దగ్గర భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం మీద ఆనందపురం దగ్గర ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కోసం ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నారు.