తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడి వేడీగా సాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాసనమండలిలో ఇవాళ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ప్రశ్నలు అడుగుతుండగా.. మాట్లాడిన శాసనమండలి ఛైర్మన్ .. రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఒక కీలక సూచన చేశారు. ఇందిరమ్మ ఇళ్లను.. ఫోర్ వీలర్‌ ఉన్నవారికి కూడా కేటాయించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రంలోని నిరుపేదలకు గూడు కల్పించాలని ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని.. అది నిజమైన అర్హులకు అందాలని తెలిపారు.ఫోర్ వీలర్ వాహనాలు ఉన్న వారిని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అనర్హులుగా ప్రకటించారని.. అయితే జీవనోపాధి కోసం లోన్లు తీసుకుని ఈఎమ్ఐలు చెల్లిస్తూ.. క్యాబ్‌లు, టాటా ఏస్ వంటి గూడ్స్ వాహనాలను నడుపుతూ బతుకుతున్నారని.. అలాంటి వాళ్లలో ఇళ్లు లేని వారు కూడా చాలా మంది ఉన్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. మండలిలో బుధవారం రోజున ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సభ్యులు ప్రశ్నలు అడుగుతుండగా.. మధ్యలో గుత్తా సుఖేందర్ కలగజేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి గూడ్స్ వాహనాలు కలిగిన వారికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరై బేస్‍మెంట్ల వరకు నిర్మాణాలు చేపట్టారని.. అలాంటి వారికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని మండలి ఛైర్మన్ పేర్కొన్నారు. సగం వరకు ఇళ్లు నిర్మించిన తర్వాత.. వారికి ఇప్పుడు ఏమి తోచట్లేదని తెలిపారు. అందుకే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనల్లో కచ్చితంగా మార్పులు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన తొలి విడత పక్కన పెడితే.. ఈ రెండో విడతలోనైనా ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉన్న వారిని ఎల్-1లోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఆ తర్వాత స్పందించిన మంత్రి .. రాష్ట్రంలోని గిరిజన తండాలు, గూడాల్లో గతంలో మొదలుపెట్టి పలు స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. అలాంటి ఇళ్లకు ఇప్పటికే పలు మినహాయింపులు ఇచ్చి లబ్ధిదారులకు అనుకూలమైన మార్పులు చేపడతామని వివరించారు. మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి విడత ఇళ్లు మంజూరు కాగా.. దశలవారీగా మిగిలిన 3 విడతలను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నాటికి సుమారు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కానున్నాయని స్పష్టం చేశారు. జూన్-జులై నాటికి తొలి విడతలో మంజూరు చేసిన 3 లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయని స్పష్టం చేశారు.