బటర్ ఫ్లై ఎఫెక్ట్.. నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన థియరీ.. ఇప్పుడు ఇదే థియరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. ఎక్కడో జరిగే ఘటన.. మరెక్కడో జరిగే ఘటనకు కారణమవుతుందనేది ఈ థియరీ. అదే విధంగా పశ్చిమాసియాలో యుద్ధం.. ఏపీలో అన్న క్యాంటీన్లకు డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తింది. దీంతో వ్యాపారాలు నడపలేక చిన్న చిన్న హోటల్స్ మూతపడే పరిస్థితి. ఇంకొంతమంది హోటల్ నిర్వాహకులు టిఫిన్ రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో అన్న క్యాంటీన్లకు డిమాండ్ పెరుగుతోంది. పేదలు, కార్మికులకు తక్కువ రేటుకే మూడు పూటలా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. రూ.5లకే భోజనం అందిస్తోంది. దీంతో చాలా మంది అన్న క్యాంటీన్లలో భోజనాలు చేస్తున్నారు. తాజాగా హోటల్స్ మూతపడుతూ ఉండటం, రేట్ల పెరుగుదల నేపథ్యంలో అన్న క్యాంటీన్లకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ఒక అన్న క్యాంటీన్ ద్వారా 500 మందికి భోజనాలు అందించారనుకుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 650 నుంచి 700 వరకూ నమోదవుతోంది. దీనికి తోడు అన్న క్యాంటీన్లలో వడ్డించే ఆహార పదార్థాలు కూడా త్వరగా అయిపోతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. అన్న క్యాంటీన్లలో గతంలో మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఆహారం అందుబాటులో ఉండేది. ప్రస్తుతం రెండు గంటలకే ఖాళీ అవుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 205 అన్న క్యాంటీన్లు నడుస్తున్నట్లు మంత్రి నారాయణ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. వీటి ద్వారా కోట్ల మందికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించినట్లు తెలిపారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. 75 అన్న క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవి కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తే మరింత మంది పేదలకు మూడు పూటల ఆహారం దొరుకుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా.. మండల కేంద్రాల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.