తెలంగాణలో సంచలనం సృష్టించిన వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతల వ్యవహారంలో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిన సంగతి తెలిసిందే. అక్కడ ఇళ్లు కోల్పోయిన వారిలో కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు వెలుగుమట్లకు చేరుకుని.. బాధితులకు అండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కూడా అక్కడికి చేరుకుని బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టిన కవిత.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కవిత.. 'ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 750 మంది పేదల ఇండ్లను కూలగొట్టిన అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డా. విశారధన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన సంయుక్త పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చింది. ఇండ్లు కూల్చేసిన వారిలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది.. ప్రజా పోరాటాలు తప్పక విజయం సాధిస్తాయనే విషయం నిరూపితమైంది. 750 మంది ఇండ్లు కూల్చివేసి కేవలం 411 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడంతో మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం జరిగిందనే భావన వారిలో నెలకొన్నది. పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశాము. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వం వెంటబడుతుంది. నిజ నిర్ధారణ కమిటీకి ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు సంపూర్ణంగా సహకరించాలని డిమాండ్ చేస్తున్నా' అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.