కరీంనగర్ కరీంనగర్ టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన భార్య ఈనెల 16న సూసైడ్ చేసుకోగా.. ఐదు రోజుల వ్యవధిలోనే ఎస్సై చంద్రశేఖర్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కారణం ఏంటో తెలియదు కానీ.. మొదట దివ్య సూసైడ్ చేసుకుంది. విషపూరితమైన గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు ప్రయత్నించగా గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా దివ్య కడుపునొప్పితో బాధపడుతుందని ఆ నొప్పిని భరించలేకనే సూసైడ్ చేసుకున్న తెలిసింది. అయితే దివ్య అంత్యక్రియల సమయంలో కొందరు గ్రామస్థులు, బంధువులు చంద్రశేఖర్‌పై దాడికి ప్రయత్నించారు. దివ్య మరణానికి ఆయనే కారణమని ఆరోపించారు. ఆ సమయంలో దివ్య తల్లిదండ్రులే అల్లుడిని కాపాడినప్పటికీ, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య లేదన్న బాధ, సమాజం వేలెత్తి చూపుతుందన్న అవమానం ఆయనను వెంటాడాయి. భార్య చనిపోయిన ఐదో రోజు కార్యక్రమం కోసం చంద్రశేఖర్ ఇల్లందుకుంట మండలం సీతంపేటలోని తన అత్తగారింటికి వెళ్లారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక, మరోవైపు బంధువుల నుంచి ఎదురైన విమర్శలతో ఎస్సై చంద్రశేఖర్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. అక్కడ భార్య జ్ఞాపకాలు ఆయనను మరింత కలచివేశాయి. అందరూ ఇంట్లోనే ఉండగా.. ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంతసేపటికీ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఐదు రోజుల వ్యవధిలో అటు తల్లిని, ఇటు తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు పసిపిల్లల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. అమ్మానాన్నలు ఇక లేరన్న విషయం కూడా తెలియని ఆ చిన్నారుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం ఇద్దరు పిల్లల్ని అనాథలు చేయటమే కాకుండా రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.