జిల్లాలో జరిగిన కవలల పెళ్లి.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కవల సోదరులు ఇద్దరూ కవలలైన యువతులను పెళ్లి చేసుకోవటం, వారి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో ఇటీవల బాగా వైరల్ అయ్యింది. అయితే పెళ్లై నెల తిరగకుండానే వారి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కవల సోదరులలో ఒకరు చనిపోవటం.. పెళ్లింట విషాదాన్ని నింపింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్ గ్రామానికి చెందిన విజయ్, వినయ్ కుమార్‌ అనే ఇద్దరు కవల సోదరులకు గత ఫిబ్రవరి నెలలో పెళ్లి జరిగింది. దేమిక్లాన్‌కు చెందిన కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణులతో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఉగాది నేపథ్యంలో వినయ్ తన భార్యతో కలిసి గురువారం ఘన్‌పూర్‌కు వచ్చారు.శుక్రవారం రోజు ఉదయం బైక్ మీద బంధువుతో బయటకు వచ్చిన వినయ్.. గంభీరావుపేట మండలం గోరంటాలలో బంధువును దిగబెట్టారు. అక్కడి నుంచి బైక్ మీద నర్మాలలోని ఎగువ మానేరు జలాశయం వద్దకు చేరుకున్నారు. మరోవైపు వినయ్ మానేరు జలాశయం వద్దకు చేరుకున్న విషయం తెలిసిన విజయ్.. తను కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న విజయ్‌కు.. వినయ్ చెప్పులు నీటిలో కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు జాలర్ల సాయంతో గాలించారు. వినయ్ మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్టుమార్టం కోసం తరలించారు.అయితే వినయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడా.. ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగిందా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే పెళ్లి జరిగిన నెలరోజులకే ఇలా జరగటం.. అందరినీ కలిచివేస్తోంది. భార్యాపిల్లలతో కొడుకు సంతోషంగా ఉంటాడని భావించిన వినయ్ తల్లిదండ్రులు.. ఈ ఘటనతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు కోటి ఆశలతో అత్తారింటిలోకి అడుగుపెట్టిన కీర్తి ఆశలు నెల రోజులు తిరగకుండానే కల్లలయ్యాయి. భర్తతో కాపురం, పిల్లలు.. ఇలా అందమైన జీవితం ఊహించుకున్న ఆ యువతి పరిస్థితి.. ఈ ఘటనతో వర్ణనాతీతంగా మారింది. మరోవైపు వినయ్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వినయ్ సెల్ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు దర్యా్ప్తు జరుపుతున్నారు.