ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. కావ్యమారన్, డేనియల్ వెటోరీ 190,000 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2.34 కోట్లు పెట్టి అబ్రార్‌ను వేలంలో దక్కించుకున్నారు. నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే ఐపీఎల్ మాజీ ఛైర్మన్ కావ్యమారన్‌కు ఓ మెసెజ్ పెట్టడం ఇప్పుడు ఇంకాస్త ఆసక్తి రేపింది.2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్‌లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్‌రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. అంతేకాదు, సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకతతో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ అకౌంట్ కూడా తాత్కాలికంగా సస్పెండ్ అయింది. ఈ పరిణామాల మధ్య మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా స్పందించాడు. “పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో ఫ్యాన్స్ ఒకరకమైన ఇదితో ఉన్నారు కదా? ఇలాంటి సమయంలో ఇమేజ్‌నే మేనేజ్ చేసుకోవడం, మళ్లీ మన సామ్రాజ్యాలను ఎలా నిర్మించుకోవాలో నాకు తెలుసు. నాకు కాల్ చెయ్" అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. లలిత్ మోదీ పోస్ట్‌లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ మెసెజ్ మొత్తం సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించినవి అని స్పష్టంగా అర్థమవుతోంది. భారత్‌లో పరిస్థితులు, ఐపీఎల్ ప్రారంభవుతున్న సమయంలో అభిమానులతో ఇష్యూ నేపథ్యంలో లలిత్ మోదీ కావ్యమారన్‌కు ఏదో ఉచిత సలహా ఇవ్వాలి అనుకున్నట్లు తెలుస్తోంది. లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్‌లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.