: దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తున్న 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం.. కొత్త పన్ను చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై కీలక ప్రకటన చేశారు. . ఇప్పటికే కొత్త పన్ను చట్టానికి సంబంధించి ముసాయిదా నిబంధనల్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మారుతున్న నిబంధనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మారుతున్న టాక్స్ రూల్స్.. వేతన జీవులతో పాటు మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులపైనా ప్రభావం చూపున్నాయి. ఇక్కడ కంపెనీలు ఇచ్చే సౌకర్యాలు సహా హౌస్ రెంట్, గిఫ్ట్స్, లోన్లపై పన్ను రూల్స్ మారుతున్నాయి. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఈ ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.. అంటే 2027-28 అసెస్మెంట్ సంవత్సరంలో పన్నులు లెక్కించే సమయంలో ఈ నిబంధనల్ని పరిగణనలోకి తీసుకుంటారన్నమాట.కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పీఎఫ్ లేదా ఎన్‌పీఎస్ లేదా ఇతర రిటైర్మెంట్ ఫండ్లలో ఏడాదికి రూ. 7.5 లక్షలకు మించి జమ చేస్తే.. ఆ అదనపు మొత్తంపై టాక్స్ వర్తిస్తుంది. ఇక్కడ అదనపు మొత్తంపై మాత్రమే కాకుండా.. దాని మీద వచ్చే వడ్డీ, ఇతర లాభాలపైనా పన్ను చెల్లించాలి. ప్రైవేట్ కంపెనీలు కొన్ని తమ ఉద్యోగులకు వసతి సౌకర్యం కల్పిస్తుంటాయి. దీనిపైనా పన్ను పడుతుంది. ఇది 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో అయితే జీతంలో 10 శాతం, 15- 40 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీల్లో 7.5 శాతం, ఇతర ప్రాంతాల్లో 5 శాతం వరకు వాల్యూను ప్రయోజనంగా భావించి పన్ను లెక్కిస్తారు. ఇక కంపెనీనే సొంతంగా ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ వంటివి అద్దెకు తీసుకుని ఉద్యోగికి వసతి కల్పిస్తే.. ఆ అద్దె మొత్తం లేదా ఉద్యోగి జీతంలో 10 శాతం.. దీంట్లో ఏది తక్కువైతే దానిని పన్ను పరిధిలోకి చేరుస్తారు. ఇది మెట్రో నగరాల్లో పని చేసే వారికి వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.మరోవైపు కంపెనీ కార్లను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకునే ఉద్యోగులకు.. నెలకు నిర్ణీత మొత్తంలో పన్ను పడుతుంది. 1.6 లీటర్ల సామర్థ్యం ఉన్న కార్లకు అయితే నెలకు రూ. 5 వేలు, ఇంకా పెద్ద కార్లకు రూ. 7 వేల చొప్పున పడుతుంది. ఇంకా డ్రైవర్‌ను కంపెనీనే ఇస్తే నెలకు అదనంగా పన్ను భారం రూ. 3 వేలు పడుతుంది. గిఫ్ట్స్‌పై పన్ను పరిమితులు..కంపెనీలు ఇచ్చే గిఫ్ట్ వోచర్స్ లేదా ఇతర బహుమతులపై పన్ను మినహాయింపు పరిమితి పెరిగింది. ఏడాదికి రూ. 15 వేల లోపు విలువైన బహుమతులపై పన్ను ఉండదు. ఈ పరిమితి దాటితే టాక్స్ పరిధిలోకి వస్తుంది. ఉద్యోగులకు.. . కంపెనీ పని వేళల్లో ఆఫీస్ క్యాంటీన్ లేదా మీల్ వోచర్స్ ద్వారా నిర్ణీత పరిమితిలో ఈ ప్రయోజనం వాడుకుంటే పన్ను వర్తించదు. కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లోన్స్ లేదా తక్కువ వడ్డీ లోన్లపైనా పన్ను ఉంటుంది. ఎస్బీఐ లోన్ రేట్లను బట్టి ఈ వడ్డీ ప్రయోజనాన్ని లెక్కిస్తారు. లోన్ మొత్తం రూ. 2 లక్షల లోపు ఉంటే.. ఇంకా కొన్ని ప్రత్యేక అనారోగ్య చికిత్సల కోసం తీసుకున్న లోన్లపై పన్ను భారం ఉండదు. ఇదే సమయంలో కొన్ని రకాల పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు. ఇలాంటి పెట్టుబడుల ఖర్చుల్ని లెక్కించేందుకు మాత్రం కొత్త ఫార్ములా తెచ్చారు. సగటు పెట్టుబడి విలువలో ఒక శాతం మొత్తాన్ని ఖర్చుగా లెక్కిస్తారు. విదేశాలకు చెందిన డిజిటల్ కంపెనీలు.. భారత్‌లో వ్యాపారం చేస్తే ఇక్కడ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. రూ. 2 కోట్లకుపైగా ఆదాయం ఉన్నా లేదా 3 లక్షలకు మించి యూజర్లు ఉన్నా.. మన దేశంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది.