కరీంనగర్ సీపీ జల్సాలు.. ప్రైవేటు వ్యక్తులకు ఏకే-47, బుల్లెట్లు.. కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Wait 5 sec.

కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. పోలీస్ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ సీపీకి జల్సాలు ఎక్కువ అయ్యాయని.. చట్టాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలను.. ఆయన ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారని సంచలన ఆరోపణలకు తెర తీశారు. గతేడాది సెప్టెంబర్ నెలలో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్‌లో సీపీ గౌస్ ఆలం భార్య, ఆమె ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకే-47, తుపాకులతో సుమారు 160 బుల్లెట్లను కాల్చారని.. అయితే ప్రైవేట్ వ్యక్తులు వీటిని ఎలా ఉపయోగిస్తారని ఆయన నిలదీశారు. ఈ కాల్పుల్లో బోనాలపల్లిలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ గాయం అయినట్లు పేర్కొన్న కౌశిక్ రెడ్డి.. అది తెలియక ఆమె రాయి తగిలిందని భావించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం బయటికి పొక్కకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉన్నారని పేర్కొన్న కౌశిక్ రెడ్డి.. అసలు హోం శాఖలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులు.. తుపాకులు కాల్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ తాను చేసిన ఆరోపణలు అసత్యాలు అని నిరూపిస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఐపీఎస్ అసోసియేషన్ మరి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. వికాస్ అగర్వాల్ అనే ఐఆర్ఎస్ అధికారి ప్రభుత్వం ఇచ్చిన ఇన్నోవా క్రిస్టా కారును ఓ ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి పంపించారని.. ఇలాంటి కొందరు ఉన్నతాధికారుల కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను భయపడే వ్యక్తిని కాదని.. తనను బెదిరించలేడని పేర్కొన్నారు. సీపీకి ఇంటెలిజెన్స్ ఉంటే.. తనకు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు సమాచారం ఇచ్చేవాళ్లు ఉన్నారంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.