తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం '' ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఈ పురష్కారాలను ప్రదానం చేస్తోంది. ఉగాది సందర్భంగా గద్దర్‌ సినీ అవార్డుల ప్రదానోత్సవం-2025 వేడుకని ఘనంగా నిర్వహించారు. ప్రతిభకు పట్టం కడుతూ, అత్యుత్తమ సినిమాలకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించారు. అయితే పలు కారణాలతో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నేళ్లుగా 'తెలుగు సినిమా' ఈ పురస్కారాలకు నోచుకోలేకపోయింది. ఇదే అంశంపై పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025'లో ఆర్. నారాయణమూర్తికి టీఎల్ కాంతారావు పురష్కారంతో గౌరవించారు. సీఎం రేవంత్ రెడ్డి, అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ''దిల్ రాజు గారూ.. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేశా. నన్ను మాట్లాడనివ్వండి'' అని నారాయణమూర్తి సరదాగా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''మిత్రులారా గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నాను. కానీ ఇవ్వలేదు. అలాంటిది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అభిమాని, మన డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డ్స్ ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం అమోఘంగా ప్రారంభించారు''''తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి, ఇంతమంది కళాకారులని సగర్వంగా సత్కరిస్తున్నందుకు సెల్యూట్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతి రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, దిల్ రాజుకి, జ్యూరీ సభ్యులందరికీ వందనాలు. గద్దర్ గురించి చెప్పాలంటే.. 'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే' అన్న అన్నమాచార్యుల మాదిరిగా ప్రజా వాగ్గేయకారుడు. 'ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావ్ రామా' అని దేవున్నే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్''''భారతదేశం భాగ్యసీమరా.. సకల సంపదలకు కొదువలేదురా.. అంగట్లోనా అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని ఉన్నట్లు.. సకల సంపదలుగల దేశంలో, దరిద్రం ఎట్టుందో నాయనా' అంటూ ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఆయన పీపుల్స్ లెజెండ్. పాల్ రాబ్సన్ లాంటి వరల్డ్ లోనే బెస్ట్ కమ్యూనికేటర్స్ లో ఒకరు. అలాంటి వ్యక్తి పేరుమీద ఈ మహానుభావుడు(రేవంత్ రెడ్డి) అవార్డులు ఇస్తున్నందుకు సెల్యూట్. అస్సాం సింగర్, మ్యూజిషియన్ భూపేన్ హజారికాని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుంది. మహాత్మా గాంధీ, అంబేద్కర్, సీఎం ఫోటోతో పాటు హజారికా ఫోటో కూడా పెడతారు. అదీ కళాకారులకి అక్కడ ప్రభుత్వం ఇచ్చే గౌరవం. అలా ఇక్కడ గద్దర్ అవార్డులు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదులు చెప్తున్నాను''''ఇక నాకు కాంతారావు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు, కోస్తాంధ్ర రాయలసీమ దగ్గరగా ఉండడం వల్ల చాలామంది అక్కడున్న కళాకారులు ఇండస్ట్రీలోకి వచ్చారు. తెలంగాణ దూరంగా ఉండడం వల్ల, అంతగా రాలేదు.. కొద్దిమందే వచ్చారు. అందులో కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు లాంటి వారున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత మూడో హీరో మహానటుడు కాంతారావు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. ఆయన అంత గొప్పవాడు. ఆయన తెలుగు ఎంజీఆర్. కత్తి కాంతారావు అంటే మామూలు విషయం కాదు. రామారావు తర్వాత అన్ని వేషాలు వేసిన ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు. అలాంటి కాంతారావు అవార్డు నాకు ఇచ్చి, నా జన్మ ధన్యం చేసిన రేవంత్ రెడ్డికి థాంక్స్''''ఈ సందర్భంగా నేనొక విజ్ఞప్తి చేస్తున్నా. నాయుడు గారూ.. మీకు దండం పెడుతున్నాం. మీరు చాలా పెద్దవారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్లిపోతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని డెవలప్ చేస్తున్నారు. గద్దర్ పేరిట అవార్డులు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి, మీరు కూడా దయచేసి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీకు దండం పెడతాం సార్..థ్యాంక్యూ'' అని ఆర్. నారాయణమూర్తి అన్నారు.