తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను అందరూ వైభవంగా జరుపుకున్నారు. రాజకీయ నేతలు కూడా పార్టీ కార్యాలయాల్లో, వారి నివాసాల్లో పూజలు నిర్వహించారు. ఏపీ మంత్రి కూడా తన ఇంట్లో ఉగాది వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా పూజలు చేశారు. మంత్రి లోకేష్ కుటుంబంతో కలిసి ఉగాదిని జరుపుకున్నారు.. కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది పండగ చేసుకున్నట్లు ఫోటోలను షేర్ చేశారు. 'నా ఛాంప్‌తో కలిసి ఉగాది జరుపుకుంటున్నాను' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 'ఈ కొత్త ఏడాదిలో చేదు అనుభవాలు లేకుండా.. మధురమైన క్షణాలతో నింపుదాం. ఉగాది పండగ కాబట్టి.. నా కఠినమైన డైట్‌ను ఈ ఒక్క రోజుకు పక్కన పెట్టి పండగ స్పెషల్ వంటల్నిఆస్వాదిస్తాను' అన్నారు మంత్రి లోకేష్.మంత్రి నారా లోకేష్ ఉగాది వేడుకలు జరుపుకున్నట్లు పూజ గదిలోని రెండు ఫోటోలను ట్వీట్ చేశారు. అయితే ఓ ఫోటోలో.. దేవుడి ఫోటోల పక్కన ఓ బొమ్మ కనిపించింది. అయితే ఆ బొమ్మ ఏంటి అంటూ కొందరు ప్రశ్నించారు.. ఏదో అనుమానాస్పదంగా ఉందంటూ కొందరు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా.. 'అయినా క్షుద్రపూజలకు వాడే చేతబడి బొమ్మ మీ ఇంటి మందిరంలో ఉందేంటి గోవిందా?. ఇంట్లో ఉండే దేవుని మందిరం పవిత్ర స్థలం కదా… అలాంటి చోట ఇలాంటి బొమ్మ ఎందుకు ఉంది నారా లోకేష్.. ఇది ఏ సందేశం ఇస్తోంది?' అంటూ ఒకరు ట్వీట్ చేశారు. లోకేష్ పూజ గదిలో క్షుద్రపూజలు అంటూ కొందరు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా పూజగది ఫోటోపై ఆరోపణలు రావడంతో స్పందించారు. 'మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం.. ఇది దేవాన్ష్ తన నాలుగేళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ, చిన్న శివలింగం. దేవాన్ష్ శివుడిపై భక్తితో ఈ బొమ్మల్ని తయారు చేశాడు. మేము దానిని ఒక జ్ఞాపకంగా పూజ గదిలో ఉంచాము. కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. హరహరమహాదేవ్' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.మొత్తం మీద మంత్రి లోకేష్ పూజగదిలోని బొమ్మలపై క్లారిటీ ఇచ్చారు.