తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. ప్రతి నెలా టీటీడీ ఆర్జితసేవలు, దర్శనాలు, గదులకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. టీటీడీ 2026 జూన్ నెలకు సంబంధించిన ఆర్జితసేవలు, వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18న ఉదయం 10 గంట‌ల‌కు తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని . ఈ టికెట్లు పొందిన వారు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. మరోవైపు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్ లో విడుదల చేయ‌నుంది. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనుంది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌ జీయర్ స్వామి,ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ఏపీ ఆనంద‌కుమార్ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఇవాళ ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేష ల‌గ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.