వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన వీర మహిళ ఆకేపాటి సుభాషిణి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నియోజకవర్గం జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్‌తో కలిసి సుభాషిణి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మరోసారి విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆమె.. ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. అలాగే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తీవ్ర విమర్శలు చేశారు. తన కొడుకు పెళ్లిలో తాను డ్యాన్స్ చేస్తే మీకొచ్చిన నొప్పి ఏమిటంటూ ఆకేపాటి సుభాషిణి విమర్శలు గుప్పించారు. "నా కొడుకు పెళ్లికి నేను డ్యాన్స్ వేయకపోతే.. జగన్ మోహన్ రెడ్డి, నేను కలిసి డ్యా్న్స్ వేసుకోవాలా.. నా కొడుకు పెళ్లికి వచ్చిన వారితో కలిసి సంగీత్‌లో నేను డ్యాన్స్ వేస్తే తప్పుబడతారా.. మీకేంటి నొప్పి? కిరణ్ రాయల్‌తో కలిసి నేను డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ చేస్తున్నారు. అసలు నా ప్రెస్‌మీట్‌కు కిరణ్ రాయల్‌కు ఏం సంబంధం ఉంది. ఎక్కడెక్కడికో వెళ్లారు, నో ప్రాబ్లమ్ నాకేమీ ఫరక్ పడదు. సంగీత్‌ మాత్రమే కాదు రిసెప్షన్‌కు కూడా డ్యాన్స్ వేశాం.. కావాలంటే ఆ వీడియోలు కూడా పెట్టుకోండి. నా ఫంక్షన్లలో నేను డ్యాన్స్ వేసుకుంటే.. మీకేం నొప్పి? భూమన కరుణాకర్ రెడ్డి గారూ.. జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఒప్పించండి. ఈసారి నేను జగన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తా. అందుకు నేను సిద్ధం. మీరు జగన్‌ను ఒప్పించేందుకు సిద్ధమా" అని ఆకేపాటి సుభాషిణి సెటైర్లు వేశారు. మరోవైపు ఉగాది పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రజలకు కనీసం శుభాకాంక్షలు తెలియజేయలేదని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఈ క్రమంలోనే వారిని ఉద్దేశించి రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోజా వ్యాఖ్యలపై స్పందించిన జనసేన వీర మహిళ ఆకేపాటి సుభాషిణి.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డిని ఉద్దేశించి సుభాషిణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే , సుభాషిణి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే.. ఆవిడ మాట్లాడిన రీతిలోనే తాను సమాధానం ఇచ్చినట్లు సుభాషిణి స్పష్టం చేశారు. రోజా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని.. ఏం ఫోటోలు, వీడియోలు పెట్టుకున్నా భయపడేది లేదని సుభాషిణి స్పష్టం చేశారు.