తిరుమల దర్శన టికెట్లు, టీటీడీపై దుష్ప్రచారం.. తిరుపతికి చెందిన వ్యక్తి అరెస్ట్

Wait 5 sec.

టీటీడీపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన బి యోగేశ్వర్‌ టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఆరోపించారు. దర్శన టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ విమర్శలు చేశారు. యోగేశ్వర్ టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతోపాటు ప్రతిష్ఠకు భంగం కలిగించారని టీటీడీ విజిలెన్స్‌ వింగ్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యోగేశ్వర్‌‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.తిరుమల పోలీసులు యోగేశ్వర్‌ను ప్రశ్నించగా.. వ్యక్తిగత ప్రచారం కోసం టీటీడీ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తేల్చారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడంతో పాటుగా టీటీడీ ప్రతిష్ఠను దెబ్బ తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల పోలీసులు హెచ్చరించారు. అవసరమైతే అలాంటివారిని అసలు తిరుమలకు రానీయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో స్పెషల్ డ్రైవ్మరోవైపు తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్, హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కలిసి తిరుమలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తిరుమలలో నందకం, వరాహస్వామి గెస్ట్ హౌస్, కళ్యాణకట్ట, SV Shopping Complex ప్రాంతాల్లో ఉండే యాచకులు, అనధికారిక హ్యాకర్లు, భక్తుల్ని ఇబ్బందిపెట్టేవారిని గుర్తించి వారిని తిరుమల నుంచి తరలించారు. ఇటీవల కాలంలో చాలామంది స్థానిక హోటల్స్‌లో పనిచేసుకుంటూ భక్తుల కోసం ఏర్పాటు చేసి ఉన్న షెడ్లు, హాల్స్, వీరు ఆక్రమించుకొని బసచేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ శాంతిభద్రతలకు, భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకే స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. ఎలాంటి అనుమతులు లేకుండా తిరుమలలో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే హ్యాకర్లు, చాలా కాలంగా ఇక్కడే ఉంటూ భక్తుల దగ్గర యాచించుకుంటున్న 48 మందిని గుర్తించి తిరుమల నుంచి తిరుపతికి పంపించారు. మరో 10మందిని కూడా బౌండ్ ఓవర్ చేశారు. అలాగే పోలీసులు 33మంది వేలిముద్రల్ని సేకరించారు. ఇద్దరు పిల్లల్ని కూడా గుర్తించి బాలల హోమ్‌కు తరలించారు. తిరుమలలో హోటల్స్, టీ షాపులు, చిల్లర షాపులు నిర్వహించే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు. పనుల కోసం తీసుకొచ్చిన వర్కర్స్‌కు అవసరమైన వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. వారికి తిరుమలలో కాకుండా తిరుపతిలో వసతి సౌకర్యాలు కల్పించాలని.. అక్కడి నుంచి రోజూ తిరుమలకు వచ్చేలా ప్లాన్ చేయాలి అన్నారు. గత ఆరు నెలల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా మొత్తం 375మందిని తిరుమల నుంచి కిందకు పంపించారు. రాబోయే రోజుల్లో కూడా తిరుమలలో ఈ స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.