యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్!

Wait 5 sec.

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇప్పటికే గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగి.. తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఇక చమురు సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత్‌లో పవర్ పెట్రోల్‌ ధర ఇవాళ రూ.2.30 పెరగ్గా.. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో కొన్ని పెట్రోల్ బంకులు.. స్టాక్ లేక మూతపడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్‌పై భీకర దాడులతో విరుచుకుడుతుండటంతో.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు దాటడం తీవ్ర కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా చమురు రవాణాలో అంతరాయం ఏర్పడి.. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 110 డాలర్లు దాటిపోయాయి. అదే సమయంలో డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివార్లలో పెట్రోల్, డీజిల్ లేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అధ్యక్షుడు అమరేందర్‌ రెడ్డి స్పందించారు. పవర్ పెట్రోల్‌పై ఇవాళ రూ.2.26 పెంచారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ కూడా ధర పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంచనా చేశారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గిపోయిందని.. అదే సమయంలో బ్యారేల్ ముడి చమురు ధర కూడా పెరిగి కేంద్ర ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు.గత 2, 3 ఏళ్లలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని అమరేందర్ రెడ్డి తెలిపారు. 2022 దీపావళి సమయంలో స్టాక్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజల మీద భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అర్ధాంతరంగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేశాయని చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నిల్వ బకాయిలతోపాటు అడ్వాన్స్ కూడా చెల్లించాలని ఆయిల్ కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. దీంతో పెట్రోల్ బంక్‌లు 40 శాతం వరకు మూతపడినట్లు అమరేందర్ రెడ్డి తెలిపారు. తక్షణమే అడ్వాన్స్ చెల్లించడం డీలర్లకు సాధ్యం కాదని.. అందుకే వాటిని కట్టలేక పెట్రోల్ బంకులు మూసివేస్తున్నారని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అధ్యక్షుడు తెలిపారు. గతంలో అడగకపోయినా.. ఆయిల్ కంపెనీలు బలవంతంగా క్రెడిట్ ఇచ్చేవని.. కానీ ఇప్పుడు ఆ డబ్బులను వసూలు చేసుకునేందుకు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఊహాగానాలు.. సరఫరా నిలిచిపోయి దొరకదేమో అనే భయంతో వాహనదారులు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని.. ఇలా చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ కొరతకు కారణం అవుతుందని వెల్లడించారు. పెట్రోల్ వినియోగంపై వాహనదారులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తే ఈ కొరతను కొంత తగ్గించవచ్చని స్పష్టం చేశారు. అడ్వాన్స్ బుకింగ్ చేసిన డీలర్లకు కూడా డిమాండ్‌కు సరిపడా స్టాక్‌ను ఆయిల్ కంపెనీలు సరఫరా చేయలేకపోతున్నారని వెల్లడించారు.