గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. కేంద్రం కీలక ప్రకటన.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!

Wait 5 sec.

: ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రమవుతుంది. దాదాపు రెండు వారాలుగా దాడులు జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం, గల్ఫ్ దేశాలపై దాడులతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధి నుంచి నౌకలను ఇరాన్ అనుమతించకపోవడంతో భారత్‌లో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. వంట గ్యాస్ నిల్వలు తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య వినియోగంపై ఆంక్షలు విధించింది. గృహ వినియోగానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చమురు కంపెనీలను ఆదేశించింది. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్ పెరగకుండా, సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచకుండా చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో గ్యాస్ వినియోగదారులు ఇ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలే గ్యాస్ వినియోగదారుల్లో గందరగోళానికి దారితీశాయి. ఇటీవలే కేవైసీ పూర్తి చేశామని, మళ్లీ ఇప్్పుడు పూర్తి చేయాలా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. గ్యాస్ ఏజెన్సీల వద్దకు కస్టమర్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. (eKYC) అనేది కేవలం ఇప్పటి వరకు కేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు మాత్రమేనని, అందరికీ కాదని తెలిపింది. ఎల్‌పీజీ కస్టమర్లందరూ మళ్లీ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలని వార్తలు వ్యాప్తి చెంది వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని గుర్తించిన క్రమంలో ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. 'ఇది కొత్త ప్రకటన ఏమీ కాదు. మరింత మంది ఎల్‌పీజీ వినియోగదారులు తమ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే పెట్రోలియం శాఖ ఇటీవల కేవైసీ చేయాలని ఆదేశించింది. కానీ, మళ్లీ అందరూ పూర్తి చేయాలని కాదు. ఎవరైతే ఇప్పటి వరకు ఇ-కేవైసీ పూర్తి చేయని ఎల్‌పీజీ కన్సూమర్స్ ఉంటారో వారు ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు పీఎం ఉజ్వల యోజన కస్టమర్ కాకుండా, ఇప్పటికే కేవైసీ పూర్తి చేసి ఉంటే మీరు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఉజ్వల యోజన ద్వారా సిలిండర్ తీసుకున్న వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేవైసీ చేయాల్సి ఉంటుంది. 7 సిలిండర్ల తర్వాత 8, 9 సిలిండర్ రీఫిల్‌కు వచ్చే సబ్సిడీ పొందడానికి కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది' అని కేంద్ర పెట్రోలి, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. సిలిండర్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. ఇ-కేవైసీ పూర్తి చేయడం ద్వారా పారదర్శకత, సరైన అర్హతను గుర్తించడం, నకిలీ కస్టమర్లను ఈజీగా తొలగించడం, ఎల్‌పీజీ బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం వంటివి చేయవచ్చని తెలిపింది. కేంద్రం చేసిన ఈ ప్రకటనతో ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట లభించిందని చెప్పవచ్చు. కేవలం ఉజ్వల యోజన కస్టమర్లు, ఇప్పటి వరకు కేవైసీ చేయని వారు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటుంది.