‘ప్లేయర్స్ కాదు టీమ్ ముఖ్యం’.. గంభీర్ మాటలకు అశ్విన్ సపోర్ట్

Wait 5 sec.

భారత క్రికెట్‌లో సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, కీలక వ్యాఖ్యలు చేశాడు. “టీమ్ ముందే.. వ్యక్తులు తర్వాత” అనే సిద్ధాంతాన్ని మరోసారి బలంగా వినిపిస్తూ, హెడ్ కోచ్ అభిప్రాయాలకు పూర్తి మద్దతు తెలిపాడు.రెవ్‌స్పోర్ట్స్‌ 4.0లో మాట్లాడిన అశ్విన్ ప్రస్తుతం భారత క్రికెట్ చర్చలు ఆటపై కాకుండా ఆటగాళ్లపై ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. “ఇప్పటి ప్రతి ప్లేయర్ ఒక బ్రాండ్‌లా మారిపోయాడు. పీఆర్, బ్రాండింగ్ సహజం. కానీ మరో ఆటగాడిపై చెడు వ్యాఖ్యలు చేయడం మాత్రం సరైంది కాదు” అని చెప్పాడు.అశ్విన్ చెప్పినట్లుగా అసలు సమస్య, క్రికెట్ టెక్నికల్ చర్చలు కూడా వ్యక్తిగత పోలికలుగా మారిపోవడమే. ఇటీవల శుభమన్ గిల్ ఔట్ అయిన విధానంపై తాను చేసిన విశ్లేషణ కూడా అదే పరిస్థితికి ఉదాహరణగా మారిందని తెలిపాడు. “నేను ‘ఏం జరిగింది? ఎందుకు జరిగింది?’ అనే కోణంలో టెక్నికల్‌గా మాట్లాడాను. కానీ అది వెంటనే ఇతర ఆటగాళ్లతో పోలికల చర్చగా మారింది” అని అన్నాడు.సోషల్ మీడియా కాలంలో వదంతులు ఎంత వేగంగా వ్యాపిస్తాయో కూడా అశ్విన్ ప్రస్తావించాడు. “ఈ ప్లేయర్‌కు ఆ ప్లేయర్‌తో సమస్య ఉంది కాబట్టి ఆడించడం లేదు అనే రూమర్స్ వరుసగా వినిపిస్తే, నిజంగానే ఏదైనా ఉందేమో అనిపిస్తుంది. అది మానవ స్వభావం” అని వివరించాడు.తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా పంచుకున్న అశ్విన్ “నేను 20 ఏళ్లుగా నా తండ్రికి ఒకే విషయం చెబుతున్నాను.. ఇంట్లో నేను ఉన్నప్పుడు మరో ఆటగాడిని విమర్శించవద్దు. ఆయనకు నా పట్ల భావోద్వేగం సహజమే, కానీ ప్రతి ఆటగాడికి తన పని ఉంటుంది” అని చెప్పాడు.టీమ్ కల్చర్ గురించి మాట్లాడుతూ కోచ్ తీసుకునే నిర్ణయాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశాడు. “గంభీర్ కోచ్‌గా తన పని చేస్తున్నాడు. నేను, విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని అనుకుంటే అది అంగీకరించాలి. అదే టీమ్ బాధ్యత” అని తెలిపాడు. అహంకారం విషయంలో కూడా అశ్విన్ కీలకంగా స్పందించాడు. “మనలో అహంకారం సహజమే. కానీ నేను అనే భావనను తగ్గిస్తేనే ఆట అసలు అర్థం అవుతుంది” అని చెప్పాడు. భారత క్రికెట్‌లో గతంలో టీమ్ స్పిరిట్ ఎలా ఉండేదో గుర్తుచేస్తూ, వీవీఎస్ లక్ష్మణ్ 2001లో ఆస్ట్రేలియాపై చేసిన 281 పరుగుల ఇన్నింగ్స్‌ను ఉదాహరణగా చెప్పాడు. “ఆ ఇన్నింగ్స్ వ్యక్తిగత గొప్పతనం కోసం కాదు.. భారత్ గెలిచినందుకే గుర్తుండిపోయింది” అని వివరించాడు.