హర్మూజ్ జల సంధి విషయంలో 48 గంటల డెడ్‌లైన్, భూతల దాడులు ప్రచారం, ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనానికి అమెరికా సంకేతాల నేపథ్యంలో ఇరాన్ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చింది. భూతల దాడులకు దిగితే తగి మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేసింది. అంతటా అమర్చుతామని ఇరాన్‌ డిఫెన్స్ కౌన్సిల్ ఈ మేరకు హెచ్చరించింది. ఇది గల్ఫ్‌లో నౌకల రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగించవచ్చని, తమ తీరం నుంచే సీమైన్స్‌ను జలాల్లోకి ప్రవేశపెట్టగలమని స్పష్టం చేసినట్టు రాయిటర్స్ కథనం పేర్కొంది. ‘‘సీమైన్స్ అమర్చడం వల్ల సుదీర్ఘకాలం పర్షియన్ గల్ఫ్ మొత్తం హర్మూజ్‌ జలసంధిలో నెలకొన్న పరిస్థితే ఉంటుంది.. 80ల్లో స్వల్పంగా అమర్చిన మైన్స్‌ను తొలగించడానికి 100 మంది మైన్ స్వీపర్లు ప్రయత్నించి విఫలమైన విషయం మర్చిపోకూడదు’’ అని శత్రుదేశాలకు ఇరాన్ గుర్తుచేసింది. ఖర్గ్ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత ముఖ్యమైంది. హర్మూజ్‌ జల సంధిని నియంత్రిస్తున్న ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఖర్గ్‌ ద్వీవిని ఆక్రమించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.ఇందుకు అనుగుణంగానే 4,500 మంది సెయిలర్లు, మెరైన్లను పశ్చిమాసియాలో అమెరికా మోహరించింది. హెలికాప్టర్లు, ఎఫ్‌-35 యుద్ధ విమానాలు, సాయుధ ల్యాండింగ్ వాహనాలతో కూడిన బెటాలియన్‌ను కూడా తరలించింది. కానీ, ఈ బలగాల మోహరింపు హర్మూజ్‌ జల సంధిని తెరవడానికా? లేదా ఖర్గ్ ద్వీపం స్వాధీనానికి అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.మరోవైపు, యుద్ధం 24 వ రోజుకు చేరుకోగా.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. తమ దేశంపైకి ఇరాన్ ప్రయోగించిన ఏడు బాలిస్టిక్ క్షిపణులు, 16 డ్రోన్లను అడ్డుకున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు 352 బాలిస్టిక్ , 15 క్రూయిజ్ క్షిపణులు, 1789 డ్రోన్లను యూఏఈపై ఇరాన్ ప్రయోగించింది. అటు, ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా, టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం వద్ద పేలుళ్ల శబ్దంతో ప్రయాణికులను అధికారులు షెల్టర్లకు తరలించారు. నగరం మొత్తం క్షిపణి సైరన్లు మోగడంతో తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసి, ప్రయాణికులను అలర్ట్ చేశారు.