నేటి స్మార్ట్ ప్రపంచంలో అన్నింటికీ ఆధారం సెల్‌ఫోనే. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ అదే వ్యాపకం. ఆ వ్యాపకం కాస్తా కొందరిలో శ్రుతి మించి వ్యసనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే కొంతమంది ఏం చేస్తున్నామనే దానిపై క్లారిటీ లేకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఆనక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులలో ఆన్‌‌లైన్ ద్వారా జరిగే మోసాలపై అమ్మాయిలను మరోసారి అప్రమత్తం చేశారు . అందమైన అబ్బాయిలు, సినీ నటుల ఫోటోలను డీపీలుగా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని.. అమ్మాయిలపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ఎక్స్ వేదికగా ఆడపిల్లలకు పలు సూచనలు చేశారు. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందన్నారు సజ్జనార్. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచిత వ్యక్తులతో ఆడపిల్లలకు ఏర్పడుతున్న పరిచయాలు.. వారిని ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని.. ఆ కథనాలు చూసిన తర్వాత ఎంతో బాధగా అనిపిస్తోందని ఎమోషనల్ అయ్యారు. సైబర్ నేరగాళ్లు సినీ నటులు, అందమైన యువకులు ఫోటోలను డీపీలుగా పెట్టుకుని.. నకిలీ ఖాతాలతో అమ్మాయిలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి ఫేక్ ఖాతాలతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతారని.. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొంతమంది ఆడపిల్లలు మోసపోతున్నారని సజ్జనార్ వివరించారు.ఇలాంటి అపరిచితులను గుడ్డిగా నమ్మి కొంతమంది అమ్మాయిలు.. తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను వారితో పంచుకుంటున్నారని.. అలా పంపిన తర్వాత అవతలి వ్యక్తి.. వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సజ్జనార్ వివరించారు. అలా సంపాదించిన అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. మరికొందరు భౌతికంగా కలవాలని వేధిస్తున్న ఘటనలు తన దృష్టికి వస్తున్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. పరువు పోతుందనే భయంతో, ఇంట్లో చెప్పలేక కొంతమంది అమ్మాయిలు అడిగినంత డబ్బులు ఇస్తున్నారని.. మరికొందరు వేధింపులు భరించలేక తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే భయపడవద్దని.. సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్‌కు లొంగవద్దని అమ్మాయిలకు సూచించారు. ఈ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పాలని.. డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలతో గడపాలని.. ఆన్‌లైన్‌లో వారు ఏం చేస్తున్నారనే దానిని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్లకు సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే చిక్కమని భ్రమపడవద్దని.. మీరు ఎక్కడున్నా పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.