‘మధ్యాహ్న భోజనం భిక్ష కాదు, విద్యార్థుల హక్కు.. పద్మశ్రీకి సార్థకత చేకూర్చే సలహాలివ్వండి’.. గరికపాటికి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Wait 5 sec.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టడంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తెలుగునాట సంచలనంగా మారాయి. గరికపాటి వ్యాఖ్యల్లోని ఉద్దేశాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన మాట్లాడిన తీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థాయికి తగ్గ మాటలు కాదని అభిప్రాయ పడుతున్నారు. తాజాగా, గరికపాటి వ్యాఖ్యల పట్ల ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సైతం స్పందించారు. విద్యార్థులకు మధ్యాహ్నం బడుల్లో భోజనం పెట్టడం రాజకీయ నిర్ణయం కాదని.. న్యాయ వ్యవస్థ ఆదేశాలతో అది పేద విద్యార్థుల హక్కుగా మారిందన్నారు. ఇలా మాట్లాడటాన్ని గరికపాటి విజ్ఞతకే వదిలేస్తున్నానన్న ప్రతాప్ రెడ్డి.. ఆయనకు సైతం పూర్తిగా వివరాలు తెలియకపోవచ్చని అభిప్రాయపడ్డారు.‘‘మధ్యాహ్న భోజనం ఒక లగ్జరీ కాదు, పిల్లల జన్మహక్కు. సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు 1960లో తమిళనాడు సీఎం కామరాజ్ దేశంలో తొలిసారి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేశారు. ఆ తర్వాత 1996లో ఇండియా మొత్తం ఐదో తరగతి వరకు అమలు చేశారు. 2003 నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు’’ అని ప్రతాప్ రెడ్డి తెలిపారు.‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది. జీవించడం అంటే కేవలం బతకడం కాదు.. గౌరవంగా, ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకొని బతకడం, ఇది అందరి హక్కు. విద్యాహక్కు చట్టం అని మరో చట్టం ఉంది. విద్యాహక్కు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, కడుపు కాలుతుంటే.. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు. మధ్యాహ్న భోజనం లేకుండా విద్యా హక్కు చట్టం లక్ష్యం నెరవేరదు. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని చట్టం చెబుతోంది. పిల్లలకు డ్రై రేషన్ బదులు వండిన భోజనం పెట్టాలని 2001లో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అనేది బలమైన హక్కుగా మారింది. ఇది రాజకీయ నిర్ణయం కాదు, న్యాయవ్యవస్థ బలపర్చిన హక్కు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి’’ అని పత్రాప్ రెడ్డి సూచించారు. ‘‘మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకం అమలుకయ్యే వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తున్నాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు కోసం ఒక కమిషన్ నియమించారు. మేం కూడా మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయడం కోసం అవగాహన కల్పిస్తున్నాం. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజీ.. ఇలా అన్నీ కలిపి 43,701 విద్యాసంస్థల్లో 31 లక్షల మందికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేస్తున్నారు’’ అంటూ విజయ ప్రతాప్ రెడ్డి గణాంకాలను బయటపెట్టారు.‘‘కర్రీ చేసినందుకు గానూ.. 1 నుంచి 5వ తరగతి వరకు చదివే ఒక్కో విద్యార్థికి రూ.6.75 చొప్పున.. ఆరు నుంచి ఇంటర్ వరకు చదివే ఒక్కో విద్యార్థికి రూ.10.17 పైసల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలకు గుడ్లు, పల్లి చిక్కి, రాగి జావ పెడుతున్నారు. రాగి జావ, బెల్లానికి అయ్యే వ్యయంలో 50 శాతం సత్యసాయి ట్రస్ట్, మరో 50 శాతం ఏపీ ప్రభుత్వం భరిస్తున్నాయి’’ అని ప్రతాప్ రెడ్డి తెలిపారు.‘‘మధ్యాహ్న భోజనం అనేది దానమో, ధర్మమో, భిక్షమో కాదు.. ఇది ఒక హక్కు. ఉదయం 8 గంటల కల్లా భోజనం తయారు చేసి, పిల్లలను బడికి పంపడంలో తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉంటాయి. ఎదిగే పిల్లలకు.. పేదరికంలో ఉన్న వారికి ఈ పథకం కింద వారంలో ఐదు రోజులు ఐదు గుడ్లు పెడతారు. దీన్ని కూడా విమర్శించడం నన్ను బాధించింది. ఒక విద్యార్థికి ఒకపూట బాయిల్డ్ ఎగ్ పెట్టలేదు లేదా ఒక పూట భోజనం పెట్టలేదని ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే.. 125 శాతం ఫైన్ వేస్తున్నాం. సుమోటోగా తీసుకొని కేసులు పెడుతున్నాం’’ అని ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘‘నిత్య పెళ్లికొడుకు, శోభనం పెళ్లికొడుకు, గాడిద గుడ్డు అనే కామెంట్లు బాధాకరం. ఇంకా ఎలాగైనా పెడితే బాగుంటుందని రికమండ్ చేయండి. మిమ్మల్ని ప్రభుత్వం పద్మ శ్రీతో గౌరవించింది. దానికి సార్థకత వచ్చేలా మంచి సలహాలు ఇవ్వండి. అంతే కానీ అవమానకరంగా మాట్లాడకండి. పేద పిల్లలు మనకు లెక్కలేరా..? వాళ్లు మన దేశానికి వెన్నెముక, వాళ్లే మన భవిష్యత్తు. ప్రభుత్వ బడుల్లో చదివి ఎంతో మంది గొప్ప గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రయివేట్ స్కూల్లతో పోటీ పడుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లల సంఖ్య పెరిగితేనే.. టీచర్ ఉద్యోగాలొస్తాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వాన్ని అవమానించేలా మాట్లాడొద్దు’’ అంటూ విజయ ప్రతాప్ రెడ్డి ఒకింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.