భద్రాచలం ఆలయానికి మహర్దశ.. 3 దశల్లో ఆలయాభివృద్ధి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Wait 5 sec.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై శనివారం సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి అందుకు సంబంధించిన అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భద్రాచలం ఆలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసం సుమారు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పట్లో ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కొన్ని డిజైన్లను సిద్ధం చేశారు. అయితే ఆలయ సహజత్వానికి, ప్రాచీనతకు భంగం కలుగుతుందనే వాదనలు రావడంతో అవి కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.100 కోట్ల నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం, భూసేకరణ సమస్యల వల్ల పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆగమ శాస్త్ర పండితులు, స్థపతిలు, అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, కొత్త డిజైన్లపై కసరత్తు చేయించారు. ఆలయ పరిసరాల్లోని విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. సుమారు 35 ఎకరాల వరకు విస్తరణకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. గతంలో వచ్చిన విమర్శల దృష్ట్యా, గర్భాలయం, ప్రధాన ఆలయ నిర్మాణాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, కేవలం భక్తుల సౌకర్యార్థం వెలుపలి ప్రాకారాలు, మండపాలను మాత్రమే అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో భక్తుల క్యూ లైన్లు, అన్నదాన సత్రాలు, పుష్కర ఘాట్ల ఆధునీకరణ చేపట్టనున్నారు. రెండో దశలో మాడ వీధుల నిర్మాణం, కళ్యాణ మండప అభివృద్ధి, మూడో దశలో గోదావరి తీరంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.