కొందరి జీవితాల్లో ఎంత విషాదం ఉంటుందో.. దాన్ని మరిచిపోయేలా మరో అద్భుతమైన సంఘటన వారికి ఎదురవుతుంది. 9 నెలలు కడుపులో మోసి కన్న బిడ్డ 9 ఏళ్ల తర్వాత చనిపోతే.. ఆ తల్లి పేగు ఎంత శోకిస్తుందో.. ఊహించడానికి కూడా చాలా కష్టం. అది కూడా వారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న తర్వాత.. ఇలా జరగడంతో తీవ్రంగా కుంగిపోయారు. అయితే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. వారు మరో ప్రయత్నం చేశారు. ఐవీఎఫ్ ద్వారా.. మరో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఒక చిన్నారి మరణించిన ఏడాదికే మళ్లీ అదే రూపంలో తిరిగి వచ్చాడు. అచ్చుగుద్దినట్టు అదే పోలికలు, అదే మచ్చతో పునర్జన్మ జరిగిందని ఆ తల్లిదండ్రుల ఆనందంలో మునిగిపోయారు. కరీంనగర్‌కు చెందిన ఆ దంపతులది ఒక అందమైన ప్రపంచం. ఇద్దరు కుమారులు, పచ్చని సంసారం. సంతానం చాలనుకుని తొమ్మిదేళ్ల క్రితమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో వారి పెద్ద కుమారుడు 9 ఏళ్ల వయసులో 'HLH' అనే అరుదైన బ్రెయిన్ వ్యాధితో కళ్లముందే ప్రాణాలు విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ దూరమవ్వడంతో ఆ తల్లిదండ్రుల గుండె తరుక్కుపోయింది. "మా బాబు మళ్లీ మాకే పుట్టాలి" అన్న ఆవేదన వారిని నిద్రపోనివ్వలేదు.ఆపరేషన్ అయిపోయి ఇన్నేళ్లు గడిచాక మళ్లీ బిడ్డ పుట్టడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ, ఆ దంపతులు పట్టుదలతో కరీంనగర్‌లోని డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. వారి బాధను చూసి చలించిన డాక్టర్ పద్మజ , వారికి రీ-ఆపరేషన్ చేసి, IVF (ఐవీఎఫ్) ప్రక్రియ ద్వారా ఆ తల్లి మళ్లీ గర్భం దాల్చేలా చేశారు. ఇది కేవలం ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ఒక తల్లి కన్నీటిని తుడిచేందుకు వైద్యం చేసిన పునర్నిర్మాణమిది.సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత డెలివరీ సమయం వచ్చింది. ఆపరేషన్ థియేటర్ బయట ఆ దంపతులు దేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు. బిడ్డ పుట్టాక డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. గతంలో చనిపోయిన బాబు పోలికలతో అచ్చుగుద్దినట్టుగా ఈ బాబు ఉన్నాడు. అంతకంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే.. ఏడాది క్రితం చనిపోయిన బాబు ఎడమ చేతిపై ఎక్కడైతే ఒక మచ్చ ఉండేదో, సరిగ్గా అదే చోట, అదే సైజులో ఈ బాబుకు కూడా మచ్చ ఉండటం చూసి అందరూ నివ్వెరపోయారు.ఇది కేవలం ఒక శిశువు జననం కాదు.. కాలాన్ని, కర్మను మించి నిలిచిన దైవ సంకల్పం. విజ్ఞాన శాస్త్రం అండతో విధి రాతను తిరగరాసిన అరుదైన ఘట్టం. తమ బిడ్డ మళ్లీ పుట్టాడని ఆ దంపతులు పొందుతున్న ఆనందం వర్ణనాతీతం. డాక్టర్ పద్మజ గారి అంకితభావం, ఆ తల్లిదండ్రుల అచంచలమైన విశ్వాసం కలిసి ఒక మరణించిన ప్రాణాన్ని మళ్లీ భూమి మీదికి తెచ్చినంత పని చేశాయి. ఇప్పుడు ఆ ఇంటి నిండా మళ్లీ పాత జ్ఞాపకాల వెలుగులు విరజిమ్ముతున్నాయి.