అమాయక ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ అప్‌గ్రేడ్ అవుతూ.. సరికొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఇక పెళ్లి కాని యువకులు, మహిళల బలహీనత ఉన్న వారే టార్గెట్‌గా ప్రస్తుతం సైబర్ కేటుగేళ్లు కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మహిళల పేరుతో వల వేసి.. దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఒంటరిగా ఉండే యువకులే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)సాయంతో మహిళలు మాట్లాడుతున్నట్లుగా వీడియోలు విడుదల చేసి.. పురుషులను బుట్టలో పడేసి డబ్బులు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న యాడ్‌ మోసాలపై సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఊరించి.. అకౌంట్లు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 'ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు." అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి. ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ సెక్స్‌టార్షన్ కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్' అని సజ్జనార్ ట్వీట్ చేశారు.