మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో 9 మందితో సిట్‌.. పైలట్ రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

Wait 5 sec.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ ఫామ్‌హౌస్‌‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక రాజకీయ నేతలు ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే .. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌లు.. తెలంగాణ ఈగల్ టీమ్ పోలీసులు ఈ డ్రగ్స్‌ కేసులో పట్టుబడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసు విచారణ కోసం.. మొత్తం 9 మంది పోలీసు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది.ఈ సిట్‌ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్‌ ఉండగా.. సభ్యులుగా గ్రేహౌండ్స్‌ కమాండర్‌ ఎం.రవీందర్‌.. షాద్‌నగర్‌ డీసీపీ శిరీష.. ఈగల్‌ ఫోర్స్‌ ఆఫీసర్లు సి.హరీష్‌ చంద్రారెడ్డి.. ఎన్‌.బుచ్చయ్య.. మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌వో మల్లికార్జున రెడ్డి.. ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్‌ అలీని నియమించారు. మొయినాబాద్‌లోని పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన మద్యం పార్టీలో డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలంగాణ ఈగల్ పోలీసులకు శనివారం రాత్రి సమాచారం రావడంతో ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో దొరికిన 11 మందికి టెస్ట్‌లు చేయగా.. వారిలో ఆరుగురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పాజిటివ్‌ వచ్చింది. ఇక డ్రగ్స్ పాజిటివ్‌ వచ్చిన వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఈగల్ పోలీసులు ఫామ్‌హౌస్‌లో సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్‌ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం పెను సంచలనంగా మారింది. పైలట్ రోహిత్‌ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదు చేయగా.. రోహిత్‌ రెడ్డి ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డితోపాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉన్న మిగిలిన 8 మందికి స్టేషన్‌ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఉప్పర్‌పల్లిలో జడ్జి ముందు ఈ ముగ్గురు నిందితులను ప్రవేశపెట్టిన పోలీసులు.. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.ఈ క్రమంలోనే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి సోదరుడు రితేష్‌ రెడ్డి తుపాకీ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిట్‌ అధికారులు సీపీకి లేఖ రాశారు. 2017లో రితేష్‌ రెడ్డికి సైబరాబాద్‌ పోలీసులు గన్‌ లైసెన్స్‌ జారీ చేశారు. అయితే తుపాకీని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని పేర్కొంటూ.. చర్యలు చేపట్టాలని సిట్‌ అధికారులు సీపీని కోరారు. మరోవైపు.. పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని.. దాన్ని సీజ్‌ చేయాలని కూడా రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాయడం గమనార్హం.