వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని గెలిపిస్తే.. వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. తనకు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలపై వివక్ష ఏమీ లేదని తేల్చి చెప్పారు. 2029 అసెంబ్లీ ఎన్నికల వేళ సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చి సభ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. సిద్దిపేటలో మళ్లీ సమావేశం నిర్వహించి.. అభ్యర్థిని నిలబెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేను గెలిపిస్తే.. వచ్చే కేబినెట్‌లో మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. 1984 నుంచి సిద్దిపేటలో ఒకే కుటుంబం అధికారంలో ఉందని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. అది 2029లో మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలో కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని.. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. అభివృద్ధికి అడ్డుపడతామని అంటే ఎలా అని ప్రశ్నించారు. చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తమకు తెలుసని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాలను తమ ప్రభుత్వం సమాన దృష్టితోనే చూస్తుందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను రిలీజ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు అన్నింటికీ మద్దతు ధర ఇవ్వడంతో పాటు తమ ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తున్నట్లు తెలిపారు. అన్నదాతలు కష్టపడి పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తున్నట్లు తేల్చి చెప్పారు.ఇక సీఎం రేవంత్‌ రెడ్డి.. నర్మెట్ట పర్యటనపై బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) నిరసన వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. సిద్దిపేట అభివృద్ధి ఏది అంటూ నిరసన తెలిపారు. సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదు.. కటింగ్‌ మాస్టర్‌ అంటూ బీఆర్‌ఎస్‌వీ ప్లకార్డులను ప్రదర్శించింది. సిద్దిపేట నియోజకవర్గానికి నిధులు ఏవి అని ప్రశ్నించింది. సిద్దిపేట అభివృద్ధిపై వివక్ష అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది.