తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ చర్యలు.. ఒకరిద్దరు మంత్రులు ఔట్.. కేబినెట్‌లోకి కొత్త నేతలు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మార్పులు జరగనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రుల్లో ఒకరు, లేదా ఇద్దరిని తప్పించి.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవుల నుంచి తప్పించిన వారికి ప్రమోషన్లు ఇచ్చి పార్టీలో ఉన్నత పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏ సామాజిక వర్గ మంత్రిని తొలగిస్తున్నారో.. కొత్తగా అవకాశం కల్పించే వారిని కూడా అదే సామాజిక వర్గం నుంచి తీసుకురావాలని తెలుస్తోంది.ఇక మంత్రివర్గం నుంచి తీసేసిన వారిని వారి సీనియారిటీని ఆధారంగా చేసుకుని.. సీడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఆయా మంత్రులకు ఇప్పటికే పార్టీ హైకమాండ్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. అందుకు ఆ నేతలు కూడా సానుకూలంగానే అంగీకరించినట్లు హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులను తప్పించడంతోపాటు.. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మరో 2 మంత్రి పదవులను కూడా భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.అయితే మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేసేందుకు ఆయా జిల్లాల ప్రాతినిథ్యం, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కేబినెట్ విస్తరణపై పార్టీలో అంతర్గత వివాదాలు రాకుండా ఉండేందుకు పక్కాగా ప్రణాళికలు చేస్తోంది. తప్పించిన మంత్రుల స్థానాలను అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీ చేయాలనే నిర్ణయించినట్లు సమాచారం.ఇక మంత్రి పదవుల నుంచి తప్పించిన వారు.. అవమానంగా భావించకుండా ఉండేందుకు.. వారికి ఉన్నత పదవులు ఇచ్చి హైకమాండ్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అలాంటి వారికి పార్టీలో కీలకమైన, గౌరవప్రదమైన సీడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో బీసీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఇందులో భాగంగానే బీసీల్లో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న మున్నూరు కాపులు, ఎస్టీల్లో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ నేతల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈసారి శాసనమండలి నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన ఓ నేతకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు సమాచారం.కేబినెట్‌లో మార్పుల సందర్భంగానే చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ, మండలి విప్‌ల నియామకాలు ఇటీవలె చేపట్టినా.. చీఫ్ విప్ నియామకాలను మాత్రం వాయిదా వేసినట్లు చర్చ జరుగుతోంది. మంత్రి పదవి రాని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే‌కు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నట్టు గతేడాది జూన్‌లో ప్రకటించగా.. తనకు ఆ పదవి ఇష్టం లేదని.. మంత్రి పదవి కావాలని ఆయన కాంగ్రెస్ పెద్దలకు తేల్చి చెప్పేశారు. దీంతో ఇంతవరకు కూడా డిప్యూటీ స్పీకర్ నియామకం జరగలేదు. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులకు కేబినెట్ హోదా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా వీటిని కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.